చిన్న అప్పన్న కల్తీ నెయ్యి కేజీకి రూ.25 చొప్పున కమీషన్ డిమాండ్ చేశారు: సిట్
రూ.25 చొప్పున కమీషన్ వసూలు చేసిన చిన్న అప్పన్న- హవాలా మార్గంలో చిన్న అప్పన్నకు సొమ్ము, హైకోర్టులో సిట్ తరఫున సీబీఐ వాదనలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 13, 2025 at 10:34 AM IST
Sit Said Chinna Appanna collected 25 rupees commission per kg ghee: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా తదితర డెయిరీల నుంచి చిన్న అప్పన్న కేజీకి రూ.25 చొప్పున కమీషన్ డిమాండ్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సిట్ తరఫున సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ పీఎస్పీ సురేశ్కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
విశాఖలో అప్పన్నకు 14 ఫ్లాట్లు: చిన్న అప్పన్నకు కమీషన్ ఇచ్చినట్లు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ యజమానులు వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. ఎవరి ప్రోద్భలంతో కమీషన్ వసూలు చేశారో దర్యాప్తులో తేలాల్సి ఉందని సిట్ అధికారులు అన్నారు. హవాలా మార్గంలో చిన్న అప్పన్నకు సొమ్ము చేరిందని వివరించారు. రూ.కోట్లలో బ్యాంక్ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఆయనకు 14 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. టీటీడీ అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చిన్న అప్పన్న పీఏగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తెచ్చారు.
సోమవారం ప్రకటించనున్న నిర్ణయం: ఆ సమయంలో వినియోగించిన ఫోన్లను ఇచ్చేందుకు అప్పన్న నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిలు పిటిషన్ను కొట్టేయాలని కోరారు. శుక్రవారం జరిగిన విచారణలో ఇరుపక్షాల వాదనలూ ముగిశాయి. దీంతో సోమవారం నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వై.లక్ష్మణరావు ఈ సందర్భంగా ప్రకటించారు.
అప్పన్న తరపున న్యాయవాది వాదనలిలా! కల్తీ నెయ్యి సరఫరా కేసులో బెయిలు కోసం అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ వివరాలు వెల్లడించడం లేదనీ, దర్యాప్తునకు సహకరించడం లేదనీ పిటిషనర్ను అరెస్టు చేశారు.
కల్తీనెయ్యి సరఫరా కేసులో పిటిషనర్కు సంబంధం లేదు. టీటీడీ పాలక వ్యవహారాల్లో తలదూర్చారనేది పిటిషనర్పై ప్రధాన ఆరోపణ ఉంది. నకిలీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ యజమానులు ఇప్పటికే బెయిలు పొందారు. కోర్టు విధించే ఏ షరతులకైనా పిటిషనర్ కట్టుబడి ఉంటారు. బెయిలు మంజూరు చేయండని కోరారు.
ఓ అధికారి ద్వారా వైవీ సుబ్బారెడ్డి పరిచయం: 2014-19 వరకు వైవీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసి తర్వాత ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా నియమితులు కావడానికి ఎవరు సహకరించారు? దిల్లీలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించారని సిట్ అధికారులు ప్రశ్నించగా ఓ అధికారి ద్వారా వైవీ సుబ్బారెడ్డి పరిచయం అయ్యారనీ, నిబద్ధతతో పని చేయడంతో ఆ స్థాయికి ఎదిగాననీ, ఏపీ భవన్కు వచ్చే ముఖ్యుల పర్యటనలను సమన్వయం చేసుకునే బాధ్యతలు అక్కడ నిర్వర్తించానని చిన్న అప్పన్న చెప్పినట్లు సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది.
'మీ జీతం లక్షల్లోనే కదా? - ఖాతాలోకి కోట్లు ఎలా వచ్చాయి?'
ఐదేళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి - సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి

