అంత్యక్రియలకు వెళ్తూ - అనంతలోకాలకు, రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాను వాహనం - ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం, పలువురికి గాయాలు - గాయపడినవారిని ఆస్పత్రికి తరలింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 7:01 AM IST
Road Accident in Palnadu District : బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ప్రమాదాలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. క్షేమంగా గమ్యస్థానం చేరే వరకు ఏ క్షణం ఏం జరుగుతోందన్న టెన్షన్ ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
అసలేం జరిగిందంటే?
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 13 మంది ప్రయాణిస్తుండగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తింపు: ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వాసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
అంత్యక్రియలకు వెళ్తూ: బంధువు మృతి చెందడంతో వాహనంలో గుంటూరు నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతులు కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు శారదగా గుర్తించారు. ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతోనా, లేక అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురి ప్రాణాలను బలి తీసిన 'విజిల్'
పరామర్శకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు - ఆటోను ఢీకొన్న లారీ- ముగ్గురు మృతి

