డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి భరోసా - ఉపాధి కోసం రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల
స్వయం ఉపాధి కోసం టీ- కాఫీ కేంద్రాలు - 'నేటివ్ అరకు కాఫీ', 'గాటోస్ కేఫ్' 'చాయ్ రాస్తా'తో ఒప్పందాలు- నెలకు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందుతున్న మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 28, 2026 at 10:48 AM IST
Self Employment For DWCRA Women In Rural Areas : గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధిని కల్పించే దిశగా ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. కాఫీ- టీ కేంద్రాల వంటి చిన్న తరహా వ్యాపారాలలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా, వారు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం 'నేటివ్ అరకు కాఫీ', 'చాయ్ రాస్తా', 'గాటోస్ కేఫ్' వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 140 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఎస్ఈఆర్పీ అధికారులు సమన్వయం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఒక్కో సంస్థ ఒక్కో జిల్లాలో ఐదు యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 37 ప్రాంతాల్లో 'నేటివ్ అరకు కాఫీ' కేంద్రాలు పనిచేస్తున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో 'గాటోస్ కేఫ్' కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే శ్రీకాకుళం తిరుపతిలో కూడా త్వరలో వీటిని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 'చాయ్ రాస్తా' కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వాటిని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఆసక్తి గల మహిళలు తమ సంబంధిత జిల్లాల్లోని 'వెలుగు' కార్యాలయాలను సంప్రదించవచ్చు.
- యూనిట్ ధర: రూ.4–6 లక్షలు డ్వాక్రా మహిళలకు అందుబాటులో ఉండేలా, ఈ మూడు సంస్థలు తమ యూనిట్ల కోసం నిర్దిష్ట ధరలను నిర్ణయించాయి.
- 'నేటివ్ అరకు కాఫీ' మూడు రకాల నిర్మాణ నమూనాలను రూపొందించింది. కంటైనర్ మోడల్స్, వర్కింగ్ మోడల్స్, కరెంట్ మోడల్స్. వీటి నిర్మాణ వ్యయం రూ.3.9 లక్షల నుంచి రూ.5.9 లక్షల వరకు ఉంటుంది.
- 'గాటోస్ కేఫ్' రూ.5 లక్షల వ్యయంతో కూడిన కాఫీ - టీ కేంద్రం నమూనాను ప్రతిపాదించింది.
- 'చాయ్ రాస్తా' రూ.3.9 లక్షల నుంచి రూ.6.7 లక్షల వ్యయంతో కూడిన నాలుగు రకాల కేంద్రాలను రూపొందించింది. డ్వాక్రా మహిళలు తమకు అనుకూలమైన ఎంపికను స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు.
- ఈ కార్యక్రమం కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి కూడా అందుబాటులో ఉంది.
- ప్రస్తుతం ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న మహిళలు నెలకు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. సగటున, వారు తమ ప్రారంభ పెట్టుబడిని తిరిగి రాబట్టుకుని, ఐదు నెలల్లోనే లాభాలను ఆర్జించడం ప్రారంభించారు.
35% సబ్సిడీ వర్తిస్తుంది : ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే డ్వాక్రా మహిళలకు అవసరమైన పెట్టుబడి కోసం ప్రభుత్వం బ్యాంక్ రుణాలను సమకూరుస్తుంది. లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, ఈ కార్యక్రమంలో పీఎమ్ఈజీపీ పథకాన్ని అనుసంధానిస్తున్నారు. తద్వారా ప్రాసెసింగ్, సంబంధిత పరికరాల వ్యయంపై 35% రాయితీ లభిస్తుంది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు, సంబంధిత కంపెనీలు రాయల్టీ రుసుములను కూడా మాఫీ చేశాయి.
'SHG' మహిళలకు ఉపాధికి మార్గం - సేంద్రియ ఎరువుగా గుర్రపుడెక్క!
చిన్నారుల ఆరోగ్యానికి భరోసా - ప్లాస్టిక్కు చెక్ పెడుతూ నీమ్ టాయ్స్ స్టార్టప్

