'రైతులకు అన్నివిధాలుగా న్యాయం చేస్తాం' - రాజధానిలో 2వ విడత భూసమీకరణ ప్రారంభం
తుళ్లూరు మండలం వడ్డమానులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్కుమార్తో కలిసి మంత్రి నారాయణ - రైతుల నుంచి అంగీకార పత్రాలను స్వీకరిస్తున్నా అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 1:00 PM IST
Second Phase of Land Pooling in Capital Amaravati: రాజధాని అమరావతిలో రెండో విడత భూసమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్కుమార్తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. అమరావతి మండలం ఎండ్రాయిలో సాయంత్రం 4 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నారు.
రాజధాని రెండో విడత భూసమీకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం 16,666 ఎకరాలు సమీకరించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం ఇప్పుడు భూసమీకరణ చేస్తోంది.
అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఈ భూములు తీసుకుంటోంది. రైతులకు స్థలాలు కేటాయించే లేఔట్ల అభివృద్ధికి అథారిటీ ఈ సారి కీలక నిర్ణయం తీసుకుంది. లేఔట్లలో తొలుత రెండు వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు స్థలాలు అప్పగించనుంది.
రైతులకు అన్నివిధాలుగా న్యాయం చేస్తాం: రాజధాని నిర్మాణం కోసం సేకరించిని భూమిని త్వరగా త్వరగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా మైదానం, స్మార్ట్ సిటీ పూర్తి చేయాలని సీఎం పూర్తి చేయాలని సీఎం చెప్పారన్నారు. తుళ్లూరు మండలం వడ్డమానులో 2వ విడత భూసమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సందర్బంగా మంత్రి మాట్లాడారు.
''2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ అమలు చేశారు. అప్పుడు భూసమీకరణలో భాగంగా స్థానిక రైతులకు రుణమాఫీ చేశాం. ఇప్పుడు కూడా రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కోరారు. ఇప్పుడే సీఎం చంద్రబాబుతో మాట్లాడాను. దానికి ఆయన అంగీకరించారు. ఈనెల 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తాం. రూ.1.50 లక్షల వరకు దీన్ని వర్తింపజేస్తాం. రైతులకు అన్నివిధాలుగా న్యాయం చేస్తాం'' అని మంత్రి నారాయణ తెలిపారు.
'రెండో విడత భూసమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాం. వీలైనంతా త్వరలో తీసుకున్న భూమిని అభివృద్ధి చేయమని సీఎం చంద్రబాబు చెప్పారు. మూడేళ్లలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు.' - నారాయణ, మంత్రి
ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలి: రాజధాని నిర్మాణానికి అడ్డుపడిన జగన్కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ అన్నారు. ఆయన చేసిన అన్యాయం పై రైతులు నిరసన తెలిపారని చెప్పారు. రాజధానిలో 2వ విడత భూసమీకరణ సందర్భంగా వడ్డమానులో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడారు.
''ఆర్థికపరమైన అంశాల్లో కేంద్రాన్ని ఒప్పించి సీఎం చంద్రబాబు నిధులు తీసుకొచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అన్ని విధాలుగా ఆయన కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా కేంద్రాన్ని, అంతర్జాతీయ స్థాయిలో స్టేడియం ఏర్పాటుకు నిర్ణయించారు. రాజధానికి అంతర్భాగంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఉండాలని ఆలోచించాం. రాజధాని నిర్మాణ రైతులకు కౌలు రూ.30 వేలుగా ఉంది. రైతులకు ఇచ్చే కౌలు పెంచేలా ఆలోచన చేయాలని కోరుతున్నాం. 2014-19 కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం. దాదాపు లక్ష రూపాయలు 3 విడతల్లో రుణమాఫీ చేశాం. అమరావతి రైతులకు రూ.1.50 లక్షలు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. రాజధాని అభివృద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకుందని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని'' ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ హితవు పలికారు.
అమరావతిలో రెండో దశ భూసమీకరణ - రేపు నోటిఫికేషన్
అమరావతి నిర్మాణానికి రూ.7,380 కోట్ల రుణం - సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం

