డీఎస్సీ నిర్వహణపై ఆరోపణలు అవాస్తవం - మెరిట్ ఆధారంగానే నియామకాలు: కోన శశిధర్
డీఎస్సీ ఎంపికలో అర్హత ఉన్నవారిని ఎవరినీ పక్కనపెట్టలేదన్న విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ - డీఎస్సీ నోటిఫికేషన్ను అడ్డుకునేందుకు 241 కేసులు వేసినా కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2026 at 7:32 PM IST
School Education Secretary Konasasidhar on DSC Recruitment: మెగా డీఎస్సీ-2025 నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. 2018 తర్వాత మళ్లీ 2025లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను అడ్డుకునేందుకు 241 కేసులు వేసినా రికార్డు టైంలో 148 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేశామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ఆ ఆరోపణలన్నీ అవాస్తవం: ఒకే సబ్జెక్టుకు వివిధ తేదీల్లో పరీక్షలు నిర్వహించడంతో వేర్వేరు పేపర్లే ఉంటాయని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ వివరించారు. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3 వేల ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు రూపొందించామని కోన శశిధర్ తెలిపారు. పర్మినెంట్ ఉద్యోగాలైన ఇద్దరికి మాత్రమే క్వశ్చన్ బ్యాంకుకు యాక్సెస్ ఉండదని, ప్రతి రోజూ పాస్ వర్డ్స్ మారుతూ ఉంటాయని కోన శశిధర్ స్పష్టం చేశారు. 100కు పైగా ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, హైకోర్టు పరీక్షలు వంటివి నిర్వహించిన టీసీఎస్ ఐయాన్కే ఈ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఇది మాన్యువల్ ఎగ్జామ్ కాదు అని, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో మెగా డీఎస్సీ నిర్వహించామని వెల్లడించారు. స్కోర్స్ ఇవ్వలేదని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కోన శశిధర్ మండిపడ్డారు.
పారదర్శకంగానే నియామకాలు: సర్టిఫికెట్ వెరిఫికేషనులో భాగంగా ముందుగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిబంధన పెట్టామని, వెరిఫికెషన్కు వచ్చినప్పుడు తెస్తామని రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు. గతానుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా 1:1 పద్దతిలో పిలిచామని దీన్ని ఆనాడే అందరికీ చెప్పామని విద్యాశాఖ కార్యదర్శి వెల్లడించారు. వెరిఫికేషన్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్కు పిలిచామన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్లు స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్కు ఇవ్వాల్సి ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే కోర్టులు డీఎస్సీ-2025 నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తేల్చి చెప్పారు. కొంతమందికి ఉన్న అనుమానాలను నివృత్తి చేశామని తెలిపారు. సంవత్సరం పూర్తైన తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని కోన శశిధర్ ఆక్షేపించారు.
దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్లు అప్లోడ్: డీఎస్సీ అభ్యర్థుల మార్కులను వెబ్సైట్లో ప్రచురించామన్నారు. మార్కులు ప్రచురించలేదని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు సమయంలోనే అన్నీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని చెప్పామన్నారు. వేర్వేరుచోట్ల చదవడం వల్ల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ సమయంలో చూపిస్తామని అభ్యర్థించారని తెలిపారు. మరికొందరు అభ్యర్థులు ఈ నిబంధన సడలించాలని కోరడంతో మార్చామని తెలియజేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచామన్నారు. స్పోర్ట్స్, డిసేబిలిటీ, మహిళలు, ఎక్స్సర్వీస్మెన్లకు హారిజాంటల్ కోటా అమలు చేశామని పేర్కొన్నారు.
అర్హత ఉన్నవాళ్లెవరినీ పక్కన పెట్టలేదు: హారిజాంటల్ రిజర్వేషన్ల వల్ల కొందరు మెరిట్ అభ్యర్థులకు పోస్టు రాలేదు. డీఎస్సీలో అక్రమాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. అర్హత ఉన్నవాళ్లను ఎవరినీ పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఇచ్చామన్నారు. మేం చెప్పిన సమాధానాలకు కోర్టులు సంతృప్తి చెందాయన్నారు. కోర్టులు సంతృప్తి చెందడం వల్లే నియామకాలకు ఎలాంటి అడ్డంకులు రాలేదని వివరించారు. డీఎస్సీ నిర్వహణలో ప్రతీది పద్ధతి ప్రకారమే జరిగిందని మరోసారి కోన శశిధర్ గుర్తు చేశారు.
"డీఎస్సీ దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని చెప్పాం. వేర్వేరుచోట్ల చదవడం వల్ల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ సమయంలో చూపిస్తామని అభ్యర్థించారు. మరికొందరు అభ్యర్థులు ఈ నిబంధన సడలించాలని కోరడంతో మార్చాం. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచాం. స్పోర్ట్స్, డిసేబిలిటీ, మహిళలు, ఎక్స్సర్వీస్మెన్లకు హారిజాంటల్ కోటా అమలు చేశాం. హారిజాంటల్ రిజర్వేషన్ల వల్ల కొందరు మెరిట్ అభ్యర్థులకు పోస్టు రాలేదు. అర్హత ఉన్నవాళ్లను ఎవరినీ పక్కన పెట్టలేదు. డీఎస్సీ నిర్వహణలో ప్రతీది పద్ధతి ప్రకారమే జరిగింది". -కోన శశిధర్, విద్యా శాఖ కార్యదర్శి
మెగా డీఎస్సీ ఆరోపణలపై విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ మీడియా సమావేశం
ప్రతి ఏడాది డీఎస్సీ - నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉండాలి: సీఎం చంద్రబాబు

