ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె - రవాణాశాఖ మంత్రికి నోటీసు
సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసు - రవాణాశాఖ మంత్రిని కలిసి సమ్మె నోటీసు ఇచ్చిన నేతలు - అద్దె పెంచాలని ఆర్టీసీలోని యజమానుల సంఘాల డిమాండ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 8:19 PM IST
RTC Hired Bus Owners Issue Strike Notice for Problems: కూటమి అధికారంలోకి వచ్చాక మహిళల కోసం స్త్రీ శక్తి పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం అమలు చేసిన దగ్గర నుంచి పలు రకాల సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆటో యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లు నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేయగా ఇప్పుడు తాజాగా ఆర్టీసీ అద్దె యజమానులు ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రవాణాశాఖ మంత్రిని సంఘాల నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు.
ఏపీఎస్ ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు సమ్మె సైరన్ మోగించారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇచ్చారు. సచివాలయంలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డిని కలిసిన 3 సంఘాల నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. అద్దెబస్సుల యజమానుల సంఘం, ఎంఎస్ టీసీ అసోషియేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం కలసి సమ్మెకు దిగాలని నిర్ణయించారు.
స్త్రీ శక్తి పథకం వల్ల అధిక రద్దీ వల్ల బస్సుల్లో ఇందన వినియోగం, నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు మంత్రి దృష్టికి తెచ్చారు. నష్టాలు వస్తోన్న దృష్ట్యా తమకు చెల్లించే అద్దె పెంచాలని అద్దె బస్సు యజమానుల కోరారు. పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఒకవేళ పరిష్కరించని పక్షంలో ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులు నిలిపివేస్తామని తెలిపారు.
గతంలో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు నడుపుతున్న పరిస్థితుల్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. మేము కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంతోషించి అంగీకరించడం జరిగింది. కానీ ఆ సమయంలోనే మేము నష్టాల్లో ఉన్నాము ఇప్పుడు ఈ పథకం అమలు చేస్తే మరింత నష్టాల్లోకి వెళ్తాము అని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అప్పుడు అధికారులు దీని గురించి ఆలోచించి మీకు తగిన నష్టం ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాని 4 నెలలు అవుతున్నా మాకు న్యాయం జరగలేదు. అందువల్ల మేము రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించాం.- అద్దె బస్సుల యజమానుల సంఘం నేత
ఆటో డ్రైవర్ సేవలో: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు కల్పించడంతో నష్టపోయామంటున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు గంతంలో ఆటో డ్రైవర్ సేవలో పేరిట కూటమి సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో ఆర్టీసీ మార్పులు, చేర్పులు - కొత్త జిల్లాల వారీగా డిపోల విభజన
ఐదేళ్లలో అన్నీ విద్యుత్, సీఎన్జీ బస్సులే - ప్రణాళిక సిద్ధం చేసిన ఆర్టీసీ అధికారులు

