చెరువులు నిండుగా, పైరు పచ్చగా - అనూహ్యంగా పెరుగుతున్న వరి సాగు
నీటితో కళకళలాడుతున్న చెరువులు - ఖరీఫ్ సీజన్ ముగియడంతో రబీకి నాట్లు వేయడానికి పొలాలు సిద్ధం చేస్తున్న రైతులు - వరిలో సంప్రదాయ సాగు వైపు రైతులు మొగ్గు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 8:49 PM IST
Rice Cultivation Increasing in Chitoor Distrct : ఖరీఫ్ సీజన్ ముగియడంతో రైతులు రబీకి నాట్లు వేయడానికి పొలాలు సిద్ధం చేశారు. 1990వ దశకంలో ఖరీఫ్తో పాటు రబీలో సైతం వరి సాగు చేసేవారు. రానురాను నీటి వనరులను తగ్గటంతో చెరకు వైపు దృష్టి మార్చారు. అదేవిధంగా ఈ ఏడాది వర్షాలు మెండుగా కురవడంతో ప్రతి చెరువు నీటితో నిండటంతో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దీంతో రైతులు సంప్రదాయ సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో వరి సాగు అనూహ్యంగా పెరుగుతోంది. ఒకప్పుడు పూర్తిగా కనిపించకుండా పోయిన ఈ పంట ఇప్పుడు చెరువుల నీటితో కళకళలాడుతుంది. దాంతో రైతులు వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. గత సీజన్లో 11,000 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండించగా, ఇప్పుడు 12,000 వేలకు పెరిగింది. జిల్లాలో ఖరీఫ్లో 11,000 వేల హెక్టార్లలో సాగుచేస్తే ఇప్పుడు 13,000 వేలకు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కూలీల సమస్య తీరుతుందా? : ఒకప్పుడు నీరు లేక ఇబ్బంది పడేవారు. ఇప్పుడా ఇబ్బంది అనేది లేదు. ఉన్నదల్లా కూలీల కొరత మాత్రమే. అయితే ప్రభుత్వం తాజాగా ఉపాధి హామీ పథకం ద్వారా వరి సాగు కోసం కూలీలను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. వరి సీజన్లో ఉపాధి పనులకు సెలవులు ఇచ్చి పొలం పనులకు కూలీలను ఉపయోగించుకొనే విధంగా ఆదేశాలను జారీ చేసింది. మరి ఇది ఎంతవరకు ఫలితాలిస్తుందో ఇంకా చూడాల్సి ఉంది.
వరిలో వెదజల్లు సాగు : మరోవైపు తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జించే పద్ధతులపై కర్షకులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే వరిలో వెదజల్లు సాగును అనుసరిస్తున్నారు. ఈ విధానంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశముందని రైతులు పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లాలోని దాదాపు 92,000ల హెక్టార్లలో (2.22 లక్షల ఎకరాలు)లో ఖరీఫ్ సాగును నిర్దేశించారు. అయితే ఇందులో భాగంగా 52,000 ల హెక్టార్లలో(1.05 లక్షల ఎకరాలు) వెదజల్లు సాగును నిర్ణయించారు. అన్నదాతలు గతంలో ఈ విధానంపై అనాసక్తత చూపినప్పటికీ ప్రస్తుత సీజన్లో మాత్రం ఈ పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు 80,000ల ఎకరాలకుపైగా వెదజల్లు సాగును చేపట్టారు.
నీటి వినియోగం తక్కువ: వెదజల్లు విధానంలో సాగునీటి వినియోగం తక్కువగా ఉంటుంది. కూలీల సంఖ్య అంతగా ఉండదు. సాధారణ పద్ధతుల ద్వారా మడుల తయారీ, విత్తనాలు చల్లటం, మందుల పిచికారీ, నారు తీయటం, నాట్లు వేయటం వంటి ప్రక్రియలకు పెట్టుబడి ఎక్కువవుతుంది. ఈ పద్ధతిలో అయితే ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
అంతేకాకుండా విత్తనాల ఖర్చు 10 శాతం నుంచి 15 శాతం వరకు తగ్గుతాయి. పెట్టుబడి రూ.4000ల నుంచి రూ.6000ల వరకు ఆదా అవుతుంది. పంట 15 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. దీంతో ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ పొందొచ్చు. అదేవిధంగా దిగుబడి 10 నుంచి 16 శాతం పెరుగుతుంది. అయితే ఈ విధానంలో కలుపు ఎక్కువగా ఉంటుంది. దీనిపై అన్నదాతలు దృష్టి సారించాలి.
రైతులకు మంచిది : వెదజల్లు విధానంలో సమయం, ఖర్చులు ఆదా అయి రైతుకు మేలు జరుగుతుందని కాకినాడ జిల్లా వ్యవసాయ అధికారి డా. ఎన్ విజయ్కుమార్ తెలిపారు. దీనిపై ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికి అన్నదాతల్లో చైతన్యం వచ్చిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
140 రోజుల్లో పంట - సాగు ఖర్చు తక్కువ - సన్నాలపై రైతుల ఫోకస్
రాష్ట్రంలో ఏటికేడు తగ్గుతున్న వరి సాగు - కృష్ణా డెల్టాలో, ఉత్తరాంధ్రలో ఎండుతున్న పంటలు

