భూ యజమానులకు గుడ్న్యూస్ - ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగింపు
కొత్త సంవత్సరంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం - రాష్ట్రంలో 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం - మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 1, 2026 at 5:03 PM IST
|Updated : January 1, 2026 at 6:17 PM IST
Minister Anagani Satyaprasad on 22A Lands Issues: నూతన సంవత్సరం బహుమతిగా భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని తొలి సంతకం చేశారు. మిగిలిన 5 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఈ రోజు నుంచి 5 కేటగిరీలకు చెందిన భూములను 22 ఏ నిషిద్ద జాబితా నుంచి తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, సైనిక ఉద్యోగులకు భూములు, ప్రైవేటు పట్టా భూములు, రాజకీయ బాధితులకు చెందిన భూములను 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిధ్ద జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. ప్రైవేట్ భూములు 22ఏలో ఉండేందుకు వీల్లేదని, ప్రయివేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు.
రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22 ఏ నుంచి తొలగించనున్నట్లు మంత్రి తెలిపారు. మాజీ సైనికుల భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందని, 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఎ లాంటి పాత రెవెన్యూ రికార్డులు సహా ఎసైన్మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు ఉన్నా 22 ఏ నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదోకటి ఉన్నా 22 ఏ నుంచి తొలగిస్తామని తెలిపారు. 8 ఎ రిజిస్టర్లు, డీకేటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా, దాదాపు 8 రకాల నిర్దేశిత ప్రతాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22 ఏ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
''ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలి. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూముల పత్రాలుంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలి. స్వాతంత్య్ర సమరయోధుల భూములను కూడా 22ఏ నుంచి తొలగించాలి. అలానే రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22ఏ నుంచి తొలగించాలి. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమాధికారి సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుంది. ఇంక 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఏ వంటి పాత రెవెన్యూ రికార్డులున్నా సరిపోతుంది.''- అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి
2 నెలల్లో ఫ్రీ హోల్డ్ భూములపై జీవోఎం: మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ సర్కారు భూముల విషయంలో అస్తవ్యస్తంగా చేసిందన్న మంత్రి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందని తెలిపారు. రైతులకు, భూ యాజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. 2 నెలల్లో ఫ్రీ హోల్డ్ భూములపై జీవోఎం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఫ్రీ హోల్డ్ అమలు చేసేలా జీవోఎం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రేపటి నుంచి ఇంటింటికీ వచ్చి కొత్త పాస్ పుస్తకాలను సిబ్బంది రైతులకు అందిస్తారని తెలిపారు. భూముల విషయంలో తప్పు జరిగిందని తేలితే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భూముల అక్రమాల నివారణకు ప్రత్యేకంగా యాప్ను తీసుకువస్తున్నామన్న మంత్రి యజమాని భూమికి సంబంధించి సర్వే నెంబర్తో ఆధార్ లింక్ చేస్తున్నట్లు వివరించారు. పరిష్కరించలేని వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా గ్రీవెన్స్ లో వస్తున్నాయని, ఒవర్ వర్క్లోడ్ వల్లే తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు సకాలంలో సేవలందించ లేకపోతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అనగాని తెలిపారు.
'జూన్ 4 తేదీని వైఎస్సార్సీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలి'
తప్పు చేసిన వారు పీఎస్ఆర్ అయినా పెద్దిరెడ్డి అయినా శిక్ష తప్పదు : మంత్రి అనగాని

