ఆకారాలు వేరైనా అన్ని నాణేలు చెల్లుతాయ్ - ఆర్బీఐ పేరుతో సైబర్ నేరగాళ్ల వల
నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని చెబుతూ ఓ లఘు చిత్రాన్ని విడుదల- సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఎవరికీ ఏవిధమైన ఓటీపీ, పాస్వర్డ్ వంటివి చెప్పవద్దని ఆర్బీఐ సూచన

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 4:38 PM IST
RBI Create Awareness On Rupees Coins : ప్రజల్లో పలు నాణేలు చెల్లవన్న అపోహ బలంగా ప్రబలింది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆర్బీఐ గత కొన్ని సంవత్సరాలుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు నాణేల వినియోగంపై బ్యాంకర్లు, రిటెయిలర్లతో ఆర్బీఐ పలు సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల డిజైన్లలో రూ.5, రూ.10, రూ.20 ఇలా అనేక నాణేలు చెలామణీలో ఉన్నాయి. అయితే కొందరు వ్యాపారులకు సరైన అవగాహన లేక కొనుగోలుదారుల నుంచి కొన్నింటిని తీసుకోకుండా తిరస్కరిస్తున్నారు. దీనిపై పూర్తిగా అవగాహన కలిగించడానికి నేరుగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది.
లఘుచిత్రాల ప్రసారం ద్వారా ప్రచారం : రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 ఇలా ఆయా నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని చెబుతూ ఓ లఘు చిత్రాన్ని విడుదల చేసింది. దీనిలో పలువురు ఆయా వస్తువులు కొనుగోలు చేసి వ్యాపారికి నాణేలు ఇస్తే అవి చెల్లవని అంటారు. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని కార్టూన్ల ద్వారా చెబుతూ లఘుచిత్రాన్ని ముగించారు. దీనిని ఆయా బ్యాంకు ఖాతాదారుల వాట్సాప్కు ఆర్బీఐ పేరుతో సందేశాలు పంపుతున్నారు.
ఇవీ ఆర్బీఐ (RBI) సూచనలు : సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఎవరికీ ఏవిధమైన ఓటీపీ, పాస్వర్డ్ వంటివి చెప్పవద్దని ఆర్బీఐ సూచిస్తోంది. జనవరి 3వ తేదీ నుంచి చెక్కులు క్లియరెన్స్ మరింత వేగవంతం చేసి కొన్ని గంటల్లోనే ఖాతాలో జమచేసే సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నారు. చెక్ బౌన్స్ నివారించడానికి ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచాలని చెబుతున్నారు. పదేళ్లకు పైబడి బ్యాంకు ఖాతా వినియోగించకుండా వదిలేసినా, అందులోని సొమ్ము పొందడానికి కూడా వెసులుబాటు కల్పించారు. పాత ఖాతా ఉన్న సదరు బ్యాంకుకు ఖాతాదారుడే వెళ్లి కేవైసీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఖాతాదారుడు మృతి చెంది వారి కుటుంబ సభ్యులు పొందొచ్చు.
మూడు సంవత్సరాలు జైలు శిక్ష : ప్రభుత్వం ఆమోదించిన నాణేలను తిరస్కరించడం నేరం అవుతుందని స్పష్టం చేసింది. తిరస్కరించడమే గాకుండా అవి చెల్లవంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసినా శిక్ష ఖాయమని చెప్తోంది. 10, 20 రూపాయల నాణేలు చెలామణీలో ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో ఆ విషయం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ జారీచేసే డబ్బులకు మార్కెట్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. కానీ నాణేల విషయంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొన్న నాణేలు చెల్లవనే అపోహ ప్రజల్లో చాలా బలంగా ఏర్పడుతుంది. వాస్తవానికి ఇది ఎలా మొదలైందో తెలియదుగానీ, కొన్ని నాణేలు చెల్లవనే వాదన జనాల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో కొందరు వ్యాపారవేత్తలు సహా కొందరు క్రయ విక్రయాల్లో నాణేలను తీసుకోకుండా ఈ వదంతులకు మరింత బలం చేకూర్చుతున్నారు.
పది రూపాయల కాయిన్పై ఉన్న వదంతులను తిప్పికొట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు కొన్నేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఎలాంటి ఆకృతిలో ఉన్నప్పటికీ అధికారిక నాణేలు చెల్లుతాయని గతంలోనే ఆర్బీఐ స్పష్టం చేసిన విషయం విదితమే. అందువల్ల పది రూపాయల కాయిన్ను నిరాకరించవద్దని స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ కాయిన్లను నిరాకరిస్తే చట్టప్రకారం, శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఆ పది రూపాయలు వద్దంటే మూడేళ్లు జైలుకే!- ఆర్బీఐ తాజా ప్రకటన ఇదే
'ఎందుకలా దూరం పెడుతున్నారు - కాస్త నన్నూ వాడుకోండి ప్లీజ్' - పది పాట్లు

