కల్తీ పాల బాధితులకు డయాలసిస్ - ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలు
కల్తీ పాలు తాగి ఆసుపత్రిలో చేరిన వారిలో 8 మందికి వెంటిలేటర్పై, ఆరుగురికి వార్డుల్లో డయాలసిస్- పాల వ్యాపారి గణేశ్వరరావు నుంచి పాలు తీసుకున్న 110 ఇళ్లలో వైద్యాధికారులు సర్వే

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 10:36 AM IST
Rajahmundry Milk Adulteration Update: రాజమహేంద్రవరం కల్తీ పాల బారినపడి ఆసుపత్రి పాలైన వారి మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. కల్తీ పాలు తాగి ఆసుపత్రులపాలైన బాధితుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజు సూచనలతో ప్రభుత్వం ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలను రాజమహేంద్రవరానికి తెప్పించింది. బాధితుల రక్త,మూత్ర నమూనాలను తిరుపతి ఐఐటీలోని ల్యాబ్కు పంపారు.
110 ఇళ్లలో వైద్యాధికారుల సర్వే: బాధితుల్లో 12 మంది నుంచి రక్త నమూనాలు, ముగ్గురి మూత్ర నమూగాలు సేకరించి టాక్సికాలజీ పరీక్షల కోసం తిరుపతి ఐఐటీకి పంపించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజ్ సూచనల మేరకు చికిత్సకు కావాల్సిన 50 ఇంజిక్షన్లను ముంబయి నుంచి రాజమహేంద్రవరం తెప్పించారు. వీటిని డయాలిసిస్ చేస్తున్న కిడ్నీ బాధితులకు వినియోగించనున్నారు. మరోవైపు కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేశ్వరరావు నుంచి పాలు తీసుకున్న 110 ఇళ్లలో వైద్యాధికారులు సర్వే చేశారు. వారి ఆరోగ్యంపై ఆరా తీశారు.
ప్రమాదకరమని తెలిసే చేశాడిలా: లాలాచెరువు పరిసరాల్లోని చౌడేశ్వరినగర్, స్వరూప్నగర్ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, కొనసాగిస్తున్నారు. పాల వ్యాపారి గణేశ్వరరావు ఫోన్లో ఉన్న ఫోటోల ఆధారంగా పాల కేంద్రం ఫ్రీజర్లో సమస్య ముందే అతనికి తెలుసని స్పష్టమవుతోంది. ఫ్రీజర్ మరమ్మత్తులు, కూలెంట్ లీకేజీ, పాలు గడ్డకట్టడం తదితర కీలక అంశాలు ఫోన్లోని ఫోటోల ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.కూలెంట్ లీకేజీ వల్లే పాలు గడ్డకట్టాయని, ఇథలీన్ గ్లైకాల్ కలవడం ప్రమాదకరమని, పాలు పారబోయాలని బంధువు చెప్పినా గణేశ్వరరావు వినిపించుకోలేదు. పైగా ఫ్రీజర్లో రాత్రికి గడ్డ కట్టిన పాలను పగలగొట్టి రాజమహేంద్రంలో వినియోగదారులకు పోసినట్టు పోలీసు విచారణలో గణేశ్వరరావు చెప్పినట్టు తెలుస్తోంది.
విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలు: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పాల కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన మరెక్కడా చోటు చేసుకోకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలను చేపట్టారు.
కలకలం రేపిన కల్తీ పాలు - రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
పాల ‘కల్తీ’ - ఆహార భద్రతాధికారుల తనిఖీలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

