తెలంగాణలో ఈదురుగాలులలో కూడిన వర్షం - నేలరాలిన మొక్కజొన్న
భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం - హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు - ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం - రాష్ట్రంలో అకాల వర్షాలపై అప్రమత్తమైన ప్రభుత్వం

Published : February 25, 2026 at 2:51 PM IST
|Updated : February 25, 2026 at 7:54 PM IST
Rain in Hyderabad : హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండగా ఉంది. ఒంటి గంట తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది.
ఈదురుగాలులలో కూడిన వర్షానికి నేలరాలిన మొక్కజొన్న : ఈదురుగాలులతోకూడిన అకాలవర్షానికి మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం మండలంలో పలుచోట్ల మొక్కజొన్న నేలవాలింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొత్తపెళ్లి- రౌతుగూడెం మధ్య గల ముత్యాలమ్మగడ్డలో సుమారు 70 ఎకరాలు మొక్కజొన్న నేలవాలింది. మరో 20 రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట ఆ అకాల వర్షానికి నేలవాలి ఎందుకుపనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓటాయి, రాంపురంలో వీచిన గాలులకు నాలుగు కరెంట్ స్తంభాలు, భారీవృక్షం నేలకొరడంతో కొద్దిసేపు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం : తెలంగాణలో ఓ వైపు మరోవైపు వర్షం కురుస్తూ భిన్న వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ద్రోణి, క్యూంబిలోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. ఫిబ్రవరి నెల శీతాకాలం నుంచి వేసవి కాలం మార్చి, ఏప్రిల్, మే నెల మారుతున్నప్పుడు ఉష్ణోగ్రతలు క్రమంగా చల్లటి వాతావరణం నుంచి ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతాయని చెప్పారు. అదే విధంగా ఫిబ్రవరి రెండో వారంలో నుంచి మూడో వారానికి ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఫిబ్రవరి నెల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని గుర్తు చేశారు.
ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి : వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రతల కారణంగా ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడుతుంటాయని శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా తేమ గాలులు భూమిలోకి వెళ్లినప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కడైతే ఎక్కువగా ఉండాయో ఆ ప్రాంతాల్లో మేఘావృతం ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతుంటాయని పేర్కొన్నారు. ఈ జల్లులు కూడా మధ్యాహ్నం, సాయంత్రం మాత్రమే కురిసే అవకాశం ఉంటుందని, తెలంగాణలో రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయని వివరించారు.
"ఇవాళ, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తేమ గాలులు భూమిలోకి వెళ్లినప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కడైతే ఎక్కువగా ఉండాయో ఆ ప్రాంతాల్లో మేఘావృతం ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతుంటాయి."- శ్రీనివాస్ రావు, వాతావరణ శాఖ అధికారి
రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధం : తెలంగాణలో అకాల వర్షాలపై రాష్ట్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అకాల వర్షాల నుంచి రైతు పంటలకు సంరక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టార్పాలిన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
అగ్ని ప్రమాదాలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు అక్కడే అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు అందించామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల రాకపోకలు అధికంగా కొనసాగుతున్నాయని, ఆకస్మిక వాతావరణ మార్పులు, అధిక తేమ, పురుగు సమస్యలు, అగ్ని ప్రమాదాలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర అనుకోని పరిస్థితుల వల్ల మౌలిక సదుపాయాల పరంగా తాత్కాలిక నిల్వ కోసం తగినంత గోదాములు, కవర్డ్ ప్రదేశాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు.
ఈదురుగాలుల బీభత్సం : నేలకొరిగిన యాసంగి పంటలు - ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు

