రాజంపేట జిల్లా కేంద్రం కోసం కొనసాగుతున్న నిరసనలు
గత ప్రభుత్వం ఇక్కడి ప్రాంత ప్రజలను మోసం చేసింది - అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు వాగ్దానం నెరవేర్చుకోవాలి - గత 12 రోజులుగా నిరసన కార్యక్రమాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 24, 2025 at 5:19 PM IST
Protest Movement in Rajampet for District Headquarter : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో గత 12 రోజులుగా రాజంపేటను జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నియోజకవర్గ పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఇప్పటికే ఓబులవారిపల్లి పుల్లంపేట పెనగలూరు చిట్వేలి ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి.
గత ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేట కాకుండా రాయచోటిగా ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంత ప్రజలను మోసం చేసింది అన్నారు. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎడ్యుకేషనల్ జేఏసీ ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ జేఏసీతో పాటు అన్ని పార్టీల ప్రతినిధులు రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటను తప్పకుండా ఏర్పాటు చేయాలని వారు కోరారు.
'రైల్వే కోడూరులో రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిరాహార దీక్ష చేశారు. అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా నిర్ణయించాలని మీడియా సోదరులు నిత్యం ఎన్నో కథనాలు రాస్తున్నారు.' -తాతంశెట్టి నాగేంద్ర, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి
మరోవైపు ఇటీవలే జేఏసీ పిలుపు మేరకు సింహ గర్జన పేరుతో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్చందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణం పుర వీధుల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్బంగా ప్రజలు జిల్లా కేంద్రంగా రాజంపేటను ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జేఏసీ నేతలు సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.
అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు, భౌగోళికంగా మధ్యలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని, జిల్లా కేంద్రం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. గత ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలుగా విభజించి రాజంపేట నియోజకవర్గానికి అన్యాయం చేసిందని శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అన్నారు. అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గత నెల రోజులుగా నిరసనలు, ర్యాలీలు: అలానే రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. గత 10 రోజులుగా రిలే దీక్షలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజా గర్జనకు జేఏసీ సైతం పిలుపునిచ్చింది. దీంతో రాజంపేట పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలి రాగా మహిళలు, ప్రజలు, వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. రాజంపేట పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, జనసేన పార్టీ నాయకుడు అతిగారి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూల భాస్కర్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాజంపేటలో జిల్లా కేంద్రం కోసం ఉద్యమం - నిరసనలతో అట్టుడికిన పట్టణం
కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ - పలు పథకాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

