అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ-2026కు సర్వం సిద్ధం - విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
విశాఖలో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము - స్వాగతం పలికిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్, పవన్ కల్యాణ్, డోలా బాల వీరాంజనేయస్వామి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 6:10 PM IST
|Updated : February 17, 2026 at 7:55 PM IST
President Draupadi Murmu Arrives in Visakha: బుధవారం నుంచి విశాఖ సాగర తీరంలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ 2026కు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే ఈ ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు 72 దేశాలకు చెందిన 74 కుపైగా యుద్ధనౌకలు, 50కి పైగా నేవీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తీరంలో విన్యాసాలు చేశాయి. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎసస్ విక్రాంత్ మిలాన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మహిళా నావికాదళ అధికారలు దీనికి సారథ్యం వహించనున్నారు. ఇప్పటికే ఫ్లీట్ రివ్యూ 2026 సన్నాహక నిర్వహణ పూర్తి చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు చేరుకున్నారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎంపీ శ్రీభరత్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ఈస్టర్న్ నావెల్ కమాండ్ చోళాకు రాష్ట్రపతి చేరుకున్నారు. ఈ రాత్రి నౌకాదళ అధికారులతో రాష్ట్రపతి విందులో పాల్గొంటారు. ఈ విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, పవన్ కల్యాణ్తో పాటు భారత నౌక దళ ఉన్నతాధికారులు, విదేశీ నౌకాదళాధిపతులు పాల్గొంటారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ఐఎఫ్ఆర్ను వీక్షించనున్నారు. రేపు ఉదయం నావెల్ జేట్టి వద్ద సీఎం చంద్రబాబు ముర్ముకు స్వాగతం పలుకుతారు.
International Fleet Review: విశాఖ సాగర తీరం ప్రపంచ యుద్ధ నౌకాదళ ఉత్సవానికి భారత నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలన్ 2026, నేవీ చీఫ్ల కాన్ క్లేవ్కి విశాఖ నగరం వేదికైన తరుణంలో ఏర్పాట్లపై గత 3 నెలలుగా జిల్లా యంత్రాంగం పెద్ద కసరత్తే చేసింది. ఫిబ్రవరి 18న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఫ్లీట్ రివ్యూ-2026), 19న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలన్, 20న 'ఐయాన్స్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్' కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆకట్టుకునేలా 'ఇంటర్నేషనల్ సిటీ పరేడ్': 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో 'ఇంటర్నేషనల్ సిటీ పరేడ్' నిర్వహిస్తారు. వివిధ దేశాల నౌకా దళాల కవాతు ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రపంచ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తాయి. ఈ కవాతు బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు నిర్వహిస్తారు. భారత నౌకాదళ ఫైటర్ జెట్స్, పారాచూట్లు, హెలికాప్టర్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత నౌకాదళ లేజర్ షోలు, బ్యాండ్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈనెల 20న 'ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కాన్ క్లేవ్ ఆఫ్ చీఫ్స్' నిర్వహించనున్నారు.
7000 మంది పోలీసులతో బందోబస్తు: ఫ్లీట్ రివ్యూ, మిలాన్ల కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేసింది. 7,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. 64 డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జీవీఎంసీ ఆధ్వర్యంలో 119 అభివృద్ధి, సుందరీకరణ పనులను రూ.19 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. ఆర్కే బీచ్లో ప్రధాన ప్రాంగణం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రముఖులు, వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీక్షకులు విన్యాసాలు చూసేందుకు గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు.
వివిధ దేశాలకు చెందిన 23 యుద్ధనౌకలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఐఎఫ్ఆర్కు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆహ్వానించారు. ఈ ఫ్లీట్ రివ్యూలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్, ఐఎన్ఎస్ నీలగిరి, దిల్లీ, విశాఖ, రాజ్పుత్, శివాలిక్, ఆర్నాలా, బ్రహ్మపుత్ర, తల్వార్ తరగతికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములతో పాటు వివిధ దేశాలకు చెందిన దాదాపు 23 యుద్ధనౌకలు పాల్గొననున్నాయి. అందుకు తగ్గట్లు సన్నద్ధత ఏర్పాట్లు పూర్తి చేశారు.
విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం - కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ - పదేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడే ఐఎఫ్ఆర్-2026

