దేవాదాయ, విద్యుత్శాఖల మధ్య బకాయిల వివాదం - ఎట్టకేలకు దుర్గగుడికి విద్యుత్తు సరఫరా
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ - రూ.3.08 కోట్ల బకాయిలు చెల్లించలేదని చర్యలకు దిగిన సీపీడీసీఎల్ - తక్షణం రూ.2.65 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన దుర్గగుడి దేవస్థానం

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 2:46 PM IST
|Updated : December 27, 2025 at 10:42 PM IST
Power Supply Cut off at Indrakeeladri Temple in Vijayawada: దేవాదాయ, విద్యుత్శాఖల మధ్య బకాయిల వివాదం విజయవాడ దుర్గమ్మ ఆలయానికి కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేతకు దారి తీసింది. సంబంధిత మంత్రుల చొరవతో సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లు చెల్లించలేదంటూ APCPDCL అధికారులు శనివారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
తీవ్రంగా పరిగణించిన మంత్రులు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రికి విద్యుత్తు అధికారులు సరఫరా నిలిపివేయడాన్ని మంత్రులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై వెంటనే స్పందించిన దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విద్యుత్శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఫోన్లో మాట్లాడారు. సోమవారం తమశాఖ ఉన్నతాధికారులతో చర్చించి కొంత మొత్తం చెల్లించాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు.
ఇదే సమయంలో సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసి గ్రిడ్కు అనుసంధానిస్తున్న విద్యుత్తు యూనిట్ల లెక్కలు కూడా తేల్చాలని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు గట్టిగా పట్టుబట్టనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు భక్తులకు, సేవలకు, దర్శన సమయంలో లిఫ్టులు, అమ్మవారి అంతరాలయంలో ఎక్కడా సరఫరా నిలిచిపోకుండా జనరేటర్ను వినియోగించారు.
అనేకసార్లు నోటీసులు జారీ చేసినా : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రికి ఇవాళ(శనివారం) ఉదయం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉందని, 2023 ఫిబ్రవరి నుంచి ఒక్క నయాపైసా కూడా బకాయి చెల్లించకుండా విద్యుత్తు వాడుకుంటోందన్నది ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) ఆరోపిస్తోంది. అనేకసార్లు నోటీసులు జారీ చేసినా దుర్గగుడి అధికారుల్లో స్పందన లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు.
దీనికి సంబంధించిన బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఇవాళ ఉదయం చర్యలకు సన్నద్ధమవుతామని దుర్గగుడి ఈవోకు శుక్రవారం సాయంత్రమే ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) ముందస్తు సమాచారం ఇచ్చింది. దుర్గగుడి అధికారులు మాత్రం తాము సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి అందిస్తున్నామని నెట్మీటరింగ్ కోరుతూ అనేకసార్లు లేఖలు రాసినా, నేరుగా మాట్లాడినా ఏపీసీపీడీసీఎల్ అధికారుల నుంచి చర్యలు లేవంటున్నారు.
ఇంద్రకీలాద్రిలో ఆగిన విద్యుత్ సరఫరా: ఈ వ్యవహారం దేవస్థానం, విద్యుత్తుశాఖ మధ్య వివాదాస్పదంగా మారింది. ఇటీవల అమ్మవారి ఆలయానికి ఏపీసీపీడీసీఎల్ ఉన్నతాధికారులు వచ్చిన సమయంలోనూ దేవస్థానం ఈవో, పాలకమండలి మధ్య చర్చ జరిగింది. పాతపాడులోని ఐదు ఎకరాల్లో కోట్ల రూపాయలను వెచ్చించి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం సౌరవిద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ వినియోగంలోకి తేవడానికే తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు సోలార్ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతోన్న విద్యుత్తును నున్నకు సమీపంలోని గ్రిడ్కు అనుసంధానం చేశారు. దేవస్థానానికి సర్కిల్ 01 పరిధిలో ఒక హెచ్టీ (HT), 10 ఎల్టీ (10 LT) సర్వీసులున్నాయి. ఈ సర్వీసుల ద్వారా విద్యుత్తు వినియోగించుకుంటున్నారు.
దుర్గగుడి, విద్యుత్తుశాఖ మధ్య వివాదం: ఒక మెగావాట్ సౌర విద్యుత్తు ప్లాంట్ను పాతపాడులో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయిన విద్యుత్తును 12 నెలలపాటు గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును పంపిణీ సంస్థ నమోదు చేయలేదు. ఇప్పుడు తమకు బిల్లు బకాయిలు ఉన్నాయనీ, చెల్లించాలంటూ తాఖీదులిచ్చారు. దుర్గగుడి, విద్యుత్తుశాఖ మధ్య వివాదం అంశం ఈనాడు-ఈటీవీ-భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది.
జనరేటర్ సహాయంతో సేవలు: అమ్మవారి ఆలయ సందర్శనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ప్రభుత్వంలోని కీలక అధికారులు సైతం వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి ఆలయంలో దర్శనానికి జనరేటర్ సహాయంతో విద్యుత్తును కొనసాగిస్తున్నారు.
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై మంత్రి గొట్టిపాటి స్పందించారు. ఏపీసీపీడీసీఎల్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని అధికారులను ఆదేశించారు. భక్తుల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యుత్ బిల్లు బకాయిల సమస్యపై మాట్లాడి పరిష్కరించుకోవాలన్న మంత్రి సూచించారు.
దుర్గగుడిలో భక్తుల సేవల మెరుగుకు ప్రక్షాళన చర్యలు - పక్కాగా మూడంచెల ప్రణాళిక!
దుర్గగుడిలో ప్రైవేటు సిబ్బందిపై పర్యవేక్షణ కరవు - ఏటా భద్రతలో ఇబ్బందులు

