హైదరాబాద్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో రీహాబిలిటేషన్ సెంటర్ - ఎవరెస్ట్ ఫిజియోథెరపీలో ప్రారంభం
రీహాబిలిటేషన్ను ప్రారంభించిన ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ - అమెరికా ప్రమాణాలతో ఏర్పాటు చేశామన్న ఆస్పత్రి వ్యవస్థాపకులు - చికిత్స కోసం విదేశాలకు, ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందన్న వైద్యులు

Published : May 6, 2026 at 7:48 PM IST
Everest Rehabilitation Center : వైద్య రంగంలో ఒక విప్లవాత్మక అడుగు పడింది. హైదరాబాద్ వైద్య చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా శస్త్రచికిత్స లేదా తీవ్రమైన అనారోగ్యం తర్వాత రోగి కోలుకోవడానికి సరైన పర్యవేక్షణ, ఫిజియోథెరపీ, మానసికంగా మద్దతు తెలపడం అవసరం. ఇప్పటివరకు హైదరాబాద్లో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ లేదా లాంగ్ టర్మ్ రిహాబిలిటేషన్ అందించే ప్రత్యేక కేంద్రాల కొరత ఉండేది. ఈ లోటును తీరుస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ పునరావాస కేంద్రం (రీహాబిలిటేషన్ సెంటర్) రూపుదిద్దుకుంది.
బాధిత కుటుంబాలకు ఊరట : గతంలో వెన్నెముక గాయాలు (స్పైనల్ కాడ్ ఇంజూరీస్), పక్షవాతం, లేదా తీవ్రమైన మెదడు సంబంధిత సమస్యలతో బాధపడే రోగులు దీర్ఘకాలిక చికిత్స కోసం కేరళ, బెంగళూరు లేదా విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది రోగులకు శారీరక శ్రమతో పాటు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా, మానసిక భారంగా పరిణమించేది. అయితే, ఇప్పుడు హైదరాబాద్లోనే అత్యాధునిక వసతులతో కూడిన ఎవరెస్ట్ ఫిజియోథెరపీ క్లినిక్స్లో 'ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్' ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా యశోదా హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి హాజరయ్యారు.

"అమెరికాలో 20 ఏళ్ల క్లినికల్ అనుభవం తర్వాత స్వదేశంలో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించాం. పక్షవాతం, వెన్నెముక గాయాలు, వృద్ధాప్య సమస్యలు, డిమెన్షియా, పార్కిన్సన్స్ వ్యాధులతో బాధపడే రోగులకు శాస్త్రీయ, ఆధునిక చికిత్స అందిస్తాం. ఇక్కడ అమెరికా ఎవిడెన్స్ బేస్డ్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్స్ అమలు చేస్తాం" - చైర్మన్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి, ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ వ్యవస్థాపకులు
మందులు మాత్రమే కాకుండా : ఈ కేంద్రంలో రోబోటిక్ ఫిజియోథెరపీతో పాటు అధునాతన ఆక్యుపేషనల్ థెరపీ విభాగాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. రోగి పరిస్థితి ఆధారంగా ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత చికిత్సా ప్రణాళిక (పర్సనల్ ట్రీట్మెంట్ ప్లాన్) రూపొందిస్తామన్నారు. ఇక్కడ కేవలం మందులు మాత్రమే కాకుండా, రోగిని మానసికంగా దృఢంగా మార్చేందుకు కౌన్సిలింగ్ సెషన్లు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 24 గంటలు నర్సింగ్ సేవలు, అత్యవసర వైద్య సహాయం వంటివి ఇక్కడ ప్రత్యేక సమకూరుస్తామన్నారు.
"ఆసుపత్రులు రోగుల ప్రాణాలను కాపాడి స్థిరపరుస్తాయి. కానీ, వారు సాధారణ జీవనశైలికి తిరిగి వచ్చేందుకు ప్రత్యేక పునరావాస సేవలు అవసరం. మన దేశంలో ఇటువంటి అధునాతన ట్రాన్సిషనల్ కేర్ కేంద్రాలు చాలా తక్కువ. అమెరికా ప్రమాణాలతో ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ అందుబాటులోకి రావడం అభినందనీయం. ఇది రోగుల కోలుకోవడాన్ని వేగవంతం చేసి, వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది" - డాక్టర్ పవన్ గోరుకంటి, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్
కిమ్స్లో ఆర్థ్రోస్కోపీపై అంతర్జాతీయ గుర్తింపు - తొలి ఫెలోషిప్ ప్రారంభం
ప్రసవాల మధ్య మహిళలకు కనీసం 3 ఏళ్ల గ్యాప్ తప్పనిసరి - ఎందుకో తెలుసా?

