అధిక వడ్డీకి అప్పులు, వెంటనే తీర్చాలని మానసికంగా వేధింపులు - వీరి ఆగడాలకు బలైన కుటుంబం
అంబర్పేటలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య - కేసును ఛేదించిన పోలీసులు - నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్కి తరలింపు - ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే?

Published : March 2, 2026 at 8:51 PM IST
Amberpet Family Members Died Case : గత నెల 24న అంబర్పేట్ పరిధిలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న కేసును పోలీసులు ఛేదించారు. హోటల్ వ్యాపారం కోసం అప్పు తీసుకోగా వాటిని తిగిరి తీర్చే క్రమంలో వేధింపుల కారణంగా కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వేధింపులకు గురిచేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
హోటల్లో వ్యాపారం అంతంత మాత్రం : అంబర్పేట బాపునగర్ కాకతీయ వీధిలో నివాసం ఉంటున్న రామ్రాజ్ (55), మాధవి (50), దంపతులకు కుమారుడు శశాంక్ (24), ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవల వివాహం జరిపించారు. దీంతో ఆమె కొంపల్లిలో ఉంటున్నారు. గతంలో రామ్రాజ్ మరో ఇద్దరితో కలిసి అంబర్ పేటలో ల్యాండ్మార్క్ హోటల్ను ప్రారంభించారు. అనుకోని పరిస్థుల కారణంగా వారి నుంచి విడపోయి దానినుంచి బయటకు వచ్చారు. తర్వాత కొన్నాళ్లకు మల్లాపూర్లో బిర్యానీ హోటల్ పెట్టారు. కుమారుడి సాయంతో ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఈ హోటల్లో వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతోంది. దీని వల్ల వారి కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.
నిర్వహణకు మహ్మద్ వాసి ఉజ్ జమాన్, రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ నవాజ్, సయ్యద్ మాజిద్ల నుంచి సుమారు రూ.57 లక్షలు రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీతో రుణం ఇవ్వడంతో పాటుగా బ్లాంక్ చెక్కులు, ప్రామిసరి నోటులు, స్తిరాస్తి పత్రాలు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని వేధింపులకు గురిచేశారు. కుటుంబ సభ్యులతో దుర్భాషలాడారు. దీంతో మనస్థాపంలో గత నెల 24 కుటుంబం ఆత్మహత్య కు పాల్పడింది.
మిత్రుడికి వాట్సప్లో మెసేజ్ : ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీ మంగళవారం తెల్లవారు జామున రామ్ రాజ్, తన భార్య మాధవి, కుమారుడు శశాంక్తో కలిసి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రామ్ రాజ్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన మిత్రుడు రవికి వాట్సప్లో మెసేజ్ పంపించారు. దీనిని చూసిన అనంతరం ఆయన ఇంటికి వచ్చి చూశారు. ఆ సమయానికి తండ్రీ కుమారులు ఉరికి వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. మాధవి అప్పటికే ప్రాణాలు విడిచింది.
కేసుపై దర్యాప్తు చర్యలు : వెంటనే రవి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి, అదనపు డీసీపీ నర్సయ్యలతో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. దీనిలో మృతుడు శశాంక్ మణికట్టుపై గాయం చేసుకున్న గుర్తులు కనిపించాయని పోలీసులు తెలిపారు. అతడి వద్ద సూసైడ్ నోట్ను కనుగొన్నారు. కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
"గత నెల 24న ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఉజ్ జమాన్, రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ నవాజ్, సయ్యద్ మాజిద్ల రామ్రాజ్ నుంచి హోటల్ నిర్వహణకు సుమారు రూ.57 లక్షల రుణం తీసుకున్నారు. అధిక వడ్డీతో రుణం ఇవ్వడంతో పాటుగా బ్లాంక్ చెక్కులు, ప్రామిసరి నోటులు, స్తిరాస్తి పత్రాలు ఈ ముగ్గురు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. దీంతో సూసైడ్ నోట్ రాసి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నోట్లో నలుగురి పేర్లు రాశారు. ఈ కేసులో నలుగురి అరెస్టు చేసి రిమాండ్కు పంపాం." డీసీపీ రక్షితమూర్తి, సికింద్రాబాద్ జోన్
ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడేందుకు హెల్ప్లైన్ : మీకు, మీ మిత్రులు, సన్నిహితులకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చినా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, మీ సమస్యను ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటున్నా మీకు సహకరించేందుకు హెల్ప్లైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. అందుకోసం స్నేహ ఫౌండేషన్ - 04424640050 (24 x 7 అందుబాటులో ఉంటుంది) లేదా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్లైన్ - 9152987821కి సంప్రదించవచ్చు. వీరు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి మీ సమస్యలను వివరించవచ్చు. తద్వారా తగిన పరిష్కారమార్గాలను పొందవచ్చు.
బిడ్డలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య కేసు - చనిపోవడానికి అసలు కారణం ఇదే

