హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి వాహనాల రద్దీ - ట్రాఫిక్ తప్పాలంటే ఈ దారుల్లో వెళ్లండి
సంక్రాంతి సందర్భంగా నేషనల్ హైవేలపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ - ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు కీలక సూచనలు చేసిన పోలీసులు

Published : January 10, 2026 at 7:35 AM IST
Sankranti Traffic Advisory on NH-65 : విద్యాసంస్థలకు ఈరోజు నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. అయితే సాధారణంగా దిల్సుఖ్నగర్ నుంచి చౌటుప్పల్కు 1 గంటలో చేరుకోవచ్చు. కానీ గత ఏడాది సంక్రాంతి సమయంలో భోగి ముందు రోజు 3-4 గంటల సమయం పట్టింది. అంతకు 2 రోజుల ముందు కూడా చాలా సమయం పట్టింది.
ఇవాళ్టి నుంచే సెలువులు ప్రారంభమవుతుండటంతో ఈ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జాతీయ రహదారిపై అండర్పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరం నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడే బదులు దానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మార్గాల్లో వెళ్తే సులువుగా :
- హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్పల్లి వరకు వెళ్లి, అద్దంకి నేషనల్ హైవేపై నుంచి వెళ్తుంటారు. ఒకవేళ వీరు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. ఈ నార్కట్పల్లి మీదుగా వెళ్లడం వల్ల పదుల కిలోమీటర్లు దూరం పెరిగినా, హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అలాగే ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలనుకునే వారు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జునసాగర్ హైవేపైకి వెళ్తే సరిపోతుంది.
- హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘట్కేసర్లో ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ప్రవేశించొచ్చు. సిక్రింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ వైపు నుంచి కూడా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు.
- ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కట్పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పినట్లే.
- చౌటుప్పల్లో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఆరోజు చౌటుప్పల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పండగ వేళ ఈ ట్రాఫిక్ బాధలు తప్పాలంటే ఇలా కొత్త మార్గాల్లో వెళ్లడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది.
శుక్రవారం సాయంత్రమే మొదలైన రద్దీ : శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. ఈ రోజు నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి సంబురాలను సొంత ఊళ్లోలకు జరుపుకునేందుకు పల్లెకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో వాహనాలకు అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు.
కిటకిటలాడుతున్న బస్టాండ్లు : హైవేపై వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు మూసివేశారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు టోల్ప్లాజా నిర్వాహకులు 'ఈనాడు-ఈటీవీ భారత్'కు తెలిపారు. శుక్రవారం నుంచి ఎంజీబీఎస్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ బస్టాండ్లు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్సులు నిండిపోయాయి. రద్దీకి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా సరిపోవడం లేదు. ఇలా ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక ప్రైవేట్ వెహికల్స్ను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు ఇదే అదునుగా టికెట్ ధరలను డబుల్ చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంక్రాంతి ఎఫెక్ట్! - హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
నేషనల్ హైవేపై అనుకోని సమస్యా? - ఈ నెంబర్కి కాల్ చేయండి - సేవలు పొందండి

