ప్రత్యేక యాప్లతో గాలం వేస్తున్న సైబర్ మోసగాళ్లు - ఆన్లైన్ బెట్టింగ్కు బలైపోతున్న యువత
ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ప్రాణాలు బలి తీసుకుంటున్న యువకులు - ప్రత్యేక యాప్ల బెట్టింగులతో యువతకు గాలం - రూ.లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు

Published : January 5, 2026 at 1:47 PM IST
Online Betting Scams in Telangana : ఆన్లైన్ బెట్టింగ్ యువత ప్రాణాలు తీస్తోంది. ప్రతి ఒక్కరు సులువుగా డబ్బు సంపాదించేందుకు ఆశపడతారు. అందులో భాగంగా కొందరు యువత ఆన్లైన్ పందేలకు ఆకర్షితులై రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత అవమాన భారంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకదాని వెంట ఒకటి బెట్టింగ్, గేమింగ్ ఇలా పేరు ఏదైనా ఆన్లైన్ ఆటలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
ఇలా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలి, రాత్రికి రాత్రే సంపన్నులు అవ్వాలనే అత్యాశ వల్ల చివరికి రూ.వేలు, రూ.లక్షలు నష్టపోతున్నారు. ఆ అప్పులు తీరే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చాయి.
- కమలాపూర్ మండలం అంబాలకు చెందిన శ్రీకాంత్ పీజీ చదివాడు. ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ల కోసం రూ.13 లక్షల అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక మనస్తాపంతో డిసెంబర్ 25న గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయనను 108 వాహనంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- గత సంవత్సరం జనవరిలో వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన రాజ్కుమార్ అనే యువకుడు బెట్టింగ్ యాప్ల్లో రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు. పోయిన డబ్బు తిరిగి సంపాదించలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ గృహిణి బెట్టింగ్ యాప్లో జూదం ఆడి, రూ.2 లక్షలు పోగొట్టుకుంది. కుటుంబ సభ్యులు మందలించడంతో ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స అందించడంతో ఆమె బతికింది.
ప్రత్యేక యాప్ల ద్వారా మోసాలు : ప్రస్తుతం ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత జూదం, క్రికెట్, రమ్మీ తదితర బెట్టింగ్ మోసాలు పెరిగాయి. ఈ బెట్టింగ్ కోసం మోసగాళ్లు ప్రత్యేక యాప్లను రూపొందించి బెట్టింగులతో యువతకు గాలం వేస్తున్నారు. ఇలా ఆకర్షితులైన వారు బెట్టింగ్ కోసం అప్పులు చేసి ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
బెట్టింగ్లో భాగంగానే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ విషయానికొస్తే ఇక ఆంతే సంగతులు. ఈ ఆట 20 ఓవర్ల మ్యాచ్ కావడంతో బంతి, బంతికి లేదా జట్ల గెలుపోటములపై పందెం కాస్తున్నారు. రూ.500 నుంచి రూ.10వేల వరకు బెట్టింగుల్లో పెడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా గదులను అద్దెకు తీసుకొని బెట్టింగులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సెంటర్లు, నగర శివార్లలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని పందేలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్లు చూసే యువకులను లక్ష్యంగా చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు. పందెం కాసిన వారికి మొదట రూ.వందల్లో ఎరగా వేసి ఆకర్షిస్తారు. ఆ తర్వాత రూ.వేలు, రూ.లక్షలు కాజేస్తారు.
''యువత బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలి. మొదట డబ్బులు గెలిచినట్లు భ్రమ కల్పిస్తారు. అలవాటు పడిన తర్వాత పదే పదే ఆడాలనిపిస్తుంది. దీంతో అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడతారు.'' - సీపీఎస్ ఏసీపీ సదయ్య
ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి :
- క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, మంచి అలవాట్లు, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి. కొన్నిసార్లు ఆలస్యం అయినప్పటికీ సత్ఫలితాలు సాధ్యమవుతాయని విశ్వసించాలి.
- సులభంగా ఆదాయ వచ్చే మార్గం వైపు మొగ్గుచూపకుండా తమకు తామే నియంత్రించుకోవాలి.
- బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా ప్రమాదకరంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడటం గుర్తిస్తే పెద్దలకు సమాచారం అందించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
- బెట్టింగ్ విషయంలో ప్రోత్సహించినట్లు ఎవరైనా మాట్లాడినా, మొబైల్లో సంక్షిప్త సమాచారం, కాల్స్ వచ్చినా పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి.
ఆన్లైన్ బెట్టింగ్ - కుటుంబాలు అల్లకల్లోలం
డాక్టరేట్ పట్టా అందుకున్నాడు - కానీ ఆ ఒక్క వ్యసనంతో జీవితం తలకిందులైంది

