రూ.27 కోట్లతో అరణ్యరామం - శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మంగళగిరి బ్రహ్మానందపురం అటవీప్రాంతంలో అరణ్యరామం నిర్మాణం - సుమారు రూ.27 కోట్ల వ్యయంతో అరణ్యరామం నిర్మాణం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 19, 2026 at 4:47 PM IST
Pawan Kalyan Laid The Foundation Stone for Aranyaramam: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వన్యప్రాణుల సంరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీ శాఖ ప్రాంతంలో 'అరణ్యరామం' అనే పేరిట నిర్మించనున్న భవనానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.27 కోట్లతో నిర్మించనున్న ఈ భవనంలో మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోకి సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న ఏనుగుల రాకపోకలను మానిటరింగ్ చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం రెండు హెక్టార్లలో భవనం నిర్మించనున్నారు.
శిక్షణ కేంద్రానికి అడుగులు: భూమి పూజ అనంతరం పవన్ కల్యాణ్ అనంతరం ఎయిమ్స్కు వెళ్లే మార్గంలో మొక్కలు నాటారు. అరణ్యరామం డిజైన్లను పరిశీలించారు. అక్కడ కల్పించబోయే సౌకర్యాలు, అందించే శిక్షణ గురించి అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లోని దూలపల్లిలో అటవీ అధికారుల శిక్షణ కేంద్రం ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత శిక్షణకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో అరణ్యరామం పేరుతో శిక్షణ కేంద్రానికి అడుగులు పడ్డాయి.
పాల్గొన్న మంత్రులు: అరణ్యరామం భూమిపూజ అనంతరం అటవీ శాఖ సిబ్బందితో కలిసి పవన్ ఫొటోలు దిగారు. అటవీ శాఖ తరపున మొక్కలు నాటే కార్యక్రమాంలో భాగంగా స్వయంగా ఓ మొక్క నాటి ప్రారంభించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ కాంతిలాల్, దండి అటవీ దళపతి చలపతిరావు సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం కనిపించకూడదు. వాటి వల్ల మనుషులకు, మనుషుల వల్ల వాటికి ఎలాంటి ప్రాణాపాయం ఉండకూడదు. ఈ లక్ష్యాలతోనే రూపుదిద్దుకుంది HANUMAN ప్రాజెక్టు (Healing and Nurturing Units for Monitoring, Aid & Nursing of Wildlife). దీనికి గతంలోనే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
కోస్తా తీరంలో 'గ్రీన్ బెల్ట్' - వృక్ష సంపదను ప్రతి ఒక్కరూ రక్షించాలి: పవన్కల్యాణ్
మూగజీవాల కోసం ప్రాణాలకు తెగించి మెగా రెస్క్యూ ఆపరేషన్- అభినందించిన పవన్ కల్యాణ్

