హరిత సమరం - 2.5 కోట్ల విత్తన బంతులు పంపిణీ: పవన్ కల్యాణ్
అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా 2.5 కోట్ల విత్తన బంతులు పంపిణీ - జూన్లో తయారీ, జులై-ఆగస్టులో చల్లింపు - జీవవైవిధ్యం, పర్యావరణ స్థిరత్వం, వాతావరణ మార్పులను తట్టుకోవడమే లక్ష్యంగా కార్యక్రమం

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 22, 2026 at 7:02 PM IST
Pawan Kalyan Announces Massive Seed Ball Drive to Boost Greenery Across AP: రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీకి సిద్ధమైంది. జూన్లో తయారీ, జులై-ఆగస్టులో చల్లేలా ప్రణాళికలు రూపొందించారు.
భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది.
జూన్లో తయారీ - జులై-ఆగస్టులో చల్లింపు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు జరగనున్నాయి. వర్షాకాలం సీజన్ను పూర్తిగా వినియోగించుకుంటూ జులై, ఆగస్టు నెలల్లో ఈ విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
3 రకాల పద్ధతులు: విత్తన బంతుల చల్లింపునకు 3 రకాల ప్రత్యేక పద్ధతులను ఉపయోగించనున్నారు. నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ల సాంకేతికత ఉపయోగించడం, చేతులతో నాటడం చేస్తారు.
ప్రజా ఉద్యమంగా మార్చే యత్నం: ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు.
‘ప్రతి విత్తన బంతి - భవిష్యత్తుకు హామీ’: అడవులలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిణామాన్ని మెరుగుపరచడం, పచ్చదనాన్ని పెంచడం, వాతావరణ మార్పులను సమర్థంగా తట్టుకునేలా స్వచ్ఛమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం ఈ హరిత ఉద్యమం ప్రధాన లక్ష్యమని అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. “మనం చల్లే ప్రతి విత్తన బంతి మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ” అని పేర్కొన్నారు. రాబోయే తరాల కోసం రాష్ట్రాన్ని మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా మార్చేందుకు అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
2028 నాటికి ఏపీలో గ్రీన్ హైడ్రోజన్: ఇంధన రంగ నిపుణులు ఎస్.ఎస్.వి. రాంకుమార్

