ETV Bharat / state

చదువుపై తగ్గని ఆసక్తి - పిల్లలతో పాటే పదో తరగతి పాసైన తల్లిదండ్రులు

పదో తరగతిలో ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన తల్లీకుమారుడు - కుమారుడు సాయంతో చదువుకున్న తల్లి లక్ష్మీలహరి - ఆరో తరగతిలో చదువి మళ్లీ ఇప్పుడు చదివి టెన్త్‌ పాస్‌

Mother and Son Pass 10th Grade Together in West Godavari District
Mother and Son Pass 10th Grade Together in West Godavari District (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2026 at 1:52 PM IST

4 Min Read
Choose ETV Bharat

Parents Passed 10th Class with their Children: అన్నా-తమ్ముడు, అక్కా చెల్లెలు, అక్కా-తమ్ముడు, చెల్లెలు-అన్న ఇలా ఇద్దరూ ఒకేసారి పరీక్షలు పాసైన ఘటనలు చూస్తుంటాం. కానీ ఏపీలో మాత్రం అబ్బురపరిచే పలు ఘటనలు జరిగాయి. తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తల్లీకుమారుడు, తల్లీకూతుళ్లు ఉత్తీర్ణత సాధించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుమారుడి ప్రోత్సాహంతో: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీలహరి కొన్ని కారణాల వల్ల పదో తరగతి పూర్తి కాకుండానే చదువు ఆపేశారు. కుమారుడు శరణ్‌ విజయ్ ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతుండగా చదువుపై ఉన్న మమకారంతో ఆమె కూడా ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి పరీక్షలకు ఫీజు కట్టారు. ఉదయం, రాత్రి తాను చదువుకుంటున్న సమయంలోనే విజయ్‌ తన తల్లికి పాఠాలు చెప్పాడు.

ఒకేసారి టెన్త్ పాసైన తల్లీకుమారుడు - కుమారుడి ప్రోత్సాహంతో చదువుకున్న లక్ష్మీలహరి (ETV Bharat)

"ఉదయం, రాత్రి నేను చదువుకుంటున్న సమయంలో మా కుమారుడు శరణ్ విజయ్‌ పాఠాలు చెప్పాడు. చదువుపై ఉన్న ఆసక్తితో నేను కూడా ఓపెన్ స్కూల్ సొసైటీలో పదోతరగతి పరీక్షలకు ఫీజు కట్టి పరీక్షలను రాశాను. ఫలితాలు వెలువడే క్రమంలో ఒకింత టెన్షన్​కు గురయ్యాను. ఆ తర్వాత పాస్ అయ్యానని తెలిసిన తర్వాత ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. చదువుకునే సమయంలో మా కుమారుడు నన్నెంతగానో ప్రోత్యహించాడు. అర్థం కాని సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, తన చదువుకుంటూనే నాకు సైతం పాఠాలను వివరించాడు" -లక్ష్మీలహరి, పాలకొల్లు వాసి

"మా అమ్మ 6వ తరగతిలోనే చదువు ఆపేశారు. నేను చిన్నప్పుడు బాగా చదువుకోవాలనుకున్నాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చదవలేకపోయాను అని అంటుండేవారు. దాంతో నేను ఓపెన్ టెన్త్​లో చదవొచ్చు అని మా అమ్మను ప్రోత్సహించాను. దాంతో మా అమ్మ పరీక్ష ఫీజును చెల్లించి పరీక్ష రాయగా వెలువడిన ఫలితాల్లో 360 మార్కులు సాధించారు. ఈ ఫలితాలతో మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది". -విజయ్, లక్ష్మీలహరి కుమారుడు

ఆసక్తిగా చదువుకున్న లక్ష్మీలహరి రావులపాలెం వెళ్లి పరీక్షలు రాశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో కుమారుడు ఆరు వందలకు 562 మార్కులు తెచ్చుకోగా లక్ష్మీలహరికి 360 మార్కులు వచ్చాయి. కుమారుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకు ట్యూషన్ చెప్పి సహాయపడ్డాడని తల్లి లక్ష్మిలహరి మురిసిపోతోంది. ఇదే స్ఫూర్తితో తానూ ఉన్నత చదువులు పూర్తి చేసి చిన్నపాటి ఉద్యోగం చేస్తామని చెబుతోంది. అరుదైన ఘటన తర్వాత కుటుంబసభ్యులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్థులు వీరిని అభినందిస్తున్నారు.

ఒకేసారి తల్లీకుమార్తెలు ఉత్తీర్ణత: ఒకేరోజు వచ్చిన వేర్వేరు పరీక్షల ఫలితాల్లో తల్లి, కుమార్తె ఉత్తీర్ణులై సత్తా చాటారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లకు చెందిన సలాది సాత్విక ఆలమూరు బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదివి పరీక్షలు రాసింది. గురువారం విడుదలైన ఫలితాల్లో 543 మార్కులు సాధించింది.

అయితే కుమార్తెతో పాటు ఆమె తల్లి కుమారి సైతం ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు రాసి విడుదలైన ఫలితాల్లో 352 మార్కులు సాధించడం విశేషం. పదో తరగతి పూర్తికాగానే వివాహం జరగడంతో చదువుకోవాలన్న ఆసక్తి అలాగే ఉండిపోగా భర్త ప్రసాద్‌ ప్రోత్సాహంతో ఆమె ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు రాశారు. తల్లి, కుమార్తె ఇద్దరూ ఒకేరోజు ఉత్తీర్ణత సాధించడంతో వారింట్లో ఆనందానికి అవధుల్లేవు. వీరిని మండల టీడీపీ అధ్యక్షుడు ఈదల సత్తిబాబు, ప్రధాన కార్యదర్శి సలాది నాగేశ్వర్రావు, గ్రామానికి చెందిన కూటమి నాయకులు అభినందించారు.

వైఎస్సార్ జిల్లాలో సైతం: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో తల్లీకుమార్తె ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. చక్రాయపేట మండలం చేరుకొంపల్లెకు చెందిన యశోద ఎనిమిదో తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఆమెకు పెళ్లైంది. చదవాలనే కోరికతో ఈ ఏడాది ఓపెన్ స్కూల్​లో పదో తరగతి పరీక్షలు రాశారు. ఈమె కుమార్తె మానస జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్​లో పదో తరగతి చదివి పరీక్షలు రాసింది. ఈ ఫలితాలో తల్లి యశోదకు 299 మార్కులు రాగా, కుమార్తెకు 390 మార్కులు వచ్చాయి.

ఒకేసారి తండ్రీ కుమార్తె: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరానికి చెందిన తండ్రీ కుమార్తె ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. తండ్రి బాబూరావు 2001లో తొమ్మిదో తరగతితో చదువుకు స్వస్తి పలికి పశువుల కాపరిగా మారారు. నాలుగేళ్ల క్రితం నుంచి ఓ సిమెంట్ పరిశ్రమలో వెల్డర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ పని చేస్తూనే ఓపెన్ స్కూల్​లో పదో తరగతి పరీక్షలు రాయగా 257 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆయన కుమార్తె చిట్టి స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ ఉన్నత పాఠశాలలో చదివింది. పదో తరగతి పరీక్షల్లో 448 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

నాన్న లేరనే బాధను భరించి: పరీక్షలు రాసేముందు ఆ విద్యార్థిని తన కళ్లముందే జరిగిన రోడ్డుప్రమాదంలో తండ్రిని కోల్పోయింది. ఆ బాధను దిగమించి పది పరీక్షలు రాసింది. అనంతరం పరీక్ష ఫలితాల్లో 542 మార్కులు సాధించింది. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి మొదలు కాగా మార్చి 15న విశాఖకు చెందిన విద్యార్థిని అనుపమ హాల్‌టికెట్‌ను అప్పన్న పాదాల చెంత పెట్టేందుకు సింహాచలానికి తండ్రితో కలిసి బయలుదేరింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హఠాత్తుగా జరిగిన రోడ్డుప్రమాదంలో కుమార్తె కళ్లెదుటే తండ్రి మృతి చెందారు. దాంతో అంత్యక్రియలను ముగించి అనుపమ పరీక్షలకు హాజరైంది. ఫలితాల్లో ఆమె 542 మార్కులు సాధించింది. ఈ విజయం తన తండ్రికి అంకితమని పేర్కొంది.

10 ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థిని - 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లోనే మొదటి ర్యాంకు

ఎస్​ఎస్​సీ ఫలితాలు వచ్చేశాయ్! - భవిష్యత్​కు బాటలు వేసే కోర్సులు ఏంటో తెలుసా?