అనంతపురం-గుంటూరు NH 544-D విస్తరణకు మరో ముందడుగు - భూసేకరణకు నోటిఫికేషన్
వినుకొండ నుంచి గుంటూరు వరకు ఇప్పుడున్న రెండు వరుసల రహదారిని నాలుగుగా మార్చేందుకు అవసరమైన భూసేకరణకు నోటిఫికేషన్ జారీ - గ్రీన్ ఫీల్డ్లో హద్దుల ఏర్పాటుకు షెడ్యూల్ ప్రకటన

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 1:54 PM IST
National Highway 544-D Expansion Works : అనంతపురం టు గుంటూరు జాతీయ రహదారి 544-డి (NH-544D) విస్తరణకు ముందడుగు పడింది. వినుకొండ నుంచి గుంటూరు వరకు ఇప్పుడున్న రెండు వరుసల రహదారిని నాలుగుగా మార్చేందుకు అవసరమైన భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయినట్లు సంబంధిత అధికారలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని గ్రీన్ ఫీల్డ్లో హద్దుల ఏర్పాటుకు (పెగ్మార్క్ కోసం) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ప్రకటించి అధికార బృందాలను ఏర్పాటు చేసింది. దీన్ని జనవరి 9 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. సర్వే పూర్తి చేసేందుకు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారం కోరుతూ జిల్లా సంయుక్త కలెక్టర్కు ఎన్హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం లేఖ రాశారు.
విస్తరణ 85 కిలోమీటర్లు : వినుకొండ నుంచి గుంటూరు వరకు 85 కి.మీ. రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో జాతీయ రహదారుల విభాగం 3ఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత డీపీఆర్ పూర్తి కావడంతో రహదారి నిర్మించేందుకు హద్దులను గుర్తించి స్తంభాలు పాతాలని నిర్ణయించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు వేర్వేరుగా షెడ్యూల్ విడుదల చేశారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ముగ్గురు అధికారులను నియమించారు.
నష్టపరిహారం చెల్లించేందుకు సేకరించిన భూముల వివరాల సేకరణ : పల్నాడు జిల్లాలో జనవరి 9వ తేదీ వరకు, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో 10 నుంచి 12 వరకు రెండ్రోజుల్లో హద్దులు నిర్ణయించే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా మండలాల సర్వే, రెవెన్యూ అధికారులు నష్టపరిహారం చెల్లించేందుకు సేకరించిన భూముల విస్తీర్ణం, వాటి విలువలు లెక్కిస్తారు. తదుపరి ఈ ప్రక్రియ నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
ఎన్హెచ్-544డీకి త్వరలోనే భూసేకరణ - ఇక నంద్యాల టూ అమరావతికి రూట్ క్లియర్
ఈ హైవే పనులు పూర్తైతే నంద్యాల జిల్లా వాసులు రాజధాని అమరావతి వెళ్లడానికి మార్గం సుగమవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి-544డీని నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. అనంతపురం జిల్లా బుగ్గ నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు 135 కిలోమీటర్ల పొడవునా ఒక ప్యాకేజీ, వినుకొండ-గుంటూరు మధ్య 84.80 కిలోమీటర్ల మేర మరో ప్యాకేజీగా విస్తరించనున్నారు. ప్యాకేజీ-1 కింద జిల్లాలో 100 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు వరుసలుగా తీర్చిదిద్దనున్నారు. ఈ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం రూ.4200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
బైపాస్లు ఎక్కడెక్కడ అంటే : రాఘవరాజుపల్లి-కనకాద్రిపల్లి, కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె, కొలిమిగుండ్ల, అవుకు మండలం రామాపురం-అవుకు, బనగానపల్లి మండలంలోని బనగానపల్లి, టంగుటూరు, కైప, అప్పలాపురం, గోస్పాడు మండలంలోని రాయపాడు-తేళ్లపురి, దీబగుంట్ల, పసురపాడు, ఎస్.నాగులవరం, మహానంది మండలం గాజులపల్లెలో బైపాస్ రోడ్లను నిర్మించనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
సులువుగా చేరుకునేలా దారులివే
- బుగ్గ-గుంటూరు రహదారి నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.4200 కోట్లు ఖర్చు చేయనుంది. ఫలితంగా రాయలసీమ వాసులు రాజధానికి వెళ్లే మార్గం సుగమం కానుంది. ఈ రోడ్డు నిర్మాణంతో హిందూపురం, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లా వాసులతోపాటు వైఎస్సార్ కడప జిల్లా వాసులు సులువుగా రాజధాని అమరావతికి చేరుకోవచ్చు.
- అనంతపురం-గుంటూరు నాలుగు లైన్ల రహదారిని నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే అనంతపురం నుంచి బుగ్గ వరకు పనులు జరుగుతున్నాయి.
- బుగ్గ-గిద్దలూరు మధ్య రెండో ప్యాకేజీ పనులతోపాటు వినుకొండ-గుంటూరు మధ్య మరో ప్యాకేజీ పనులకు ప్రస్తుతం నిధులు మంజూరు చేశారు. బుగ్గ-గిద్దలూరు ప్యాకేజీకి సంబంధించి త్వరలో భూసేకరణ పనులు ప్రారంభించనున్నారు.

