నారా భువనేశ్వరి చొరవతో వేగంగా నిమ్మకూరు అభివృద్ధి - గ్రామస్థుల హర్షం
పాఠశాల, కళాశాల భవనాల మరమ్మతులకు భువనేశ్వరి చొరవ - గతేడాది డిసెంబర్ 26న విద్యార్థుల సమస్యలు చూసి మరమ్మతులు చేయిస్తానని, కొత్త భవనాలు కట్టిస్తానని హామీ- ఇచ్చిన మాట ప్రకారం రూ.11 కోట్లు మంజూరు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 13, 2026 at 8:22 PM IST
Nimmakuru Village Development Under Nara Bhuvaneshwari Initiative: నారా భువనేశ్వరి చొరవతో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. గ్రామ అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెనేజీలు, ఆసుపత్రి, ఇలా ఒకటని కాకుండా అన్ని విషయాల్లో నారా భువనేశ్వరి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి గ్రామంలోని పాఠశాల, కళాశాల మరమ్మతులకు, బాలుర డార్మెటరీ నూతన భవనానికి నిధులు మంజూరు చేయించారు. త్వరలో పనులు పరుగులు పెట్టనున్నాయి.
నిమ్మకూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ: ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు అంటే నారా, నందమూరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభిమానం. సీఎం చంద్రబాబు దంపతులు, బాలకృష్ణ అప్పుడప్పుడు నిమ్మకూరు వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీస్తుంటారు. నిమ్మకూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన భువనేశ్వరి 1987లో ఎన్టీఆర్ నిర్మించిన పాఠశాల, జూనియర్ కళాశాలను గతేడాది డిసెంబర్ 26న సందర్శించారు. శిథిలావస్థకు చేరిన బాలుర డార్మెటరీ, ఇతర భవనాలను పరిశీలించారు.
భువనేశ్వరి చొరవ: విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. చిన్నారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంతో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల, కళాశాల భవనాల మరమ్మతులకు రూ. 4 కోట్ల 59 లక్షలు, బాలుర డార్మెటరీకి రూ. 6 కోట్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. త్వరలో పనులు ప్రారంభం కానుండగా భువనేశ్వరి చొరవపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి ఎప్పటికప్పుడు నిమ్మకూరులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి నిమ్మకూరుని దత్తతను తీసుకుని ఆ మాట ప్రకారం అభివృద్ది పతంలో నడిపిస్తున్నారు. కేవలం బడులు, కళాశాల భవనాల మరమ్మత్తులే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజా ఆరోగ్యాన్ని గురించిన సహాయ సహకారాలు అందిస్తున్నారు.' -స్థానికులు
గ్రామస్థుల సంతోషం: 2014-19 మధ్య కాలంలో నిమ్మకూరులో నిర్మించ తలపెట్టిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వైఎస్సార్సీపీ హయాంలో పక్కపెట్టారని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా గుర్తు చేశారు. కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, నారా భువనేశ్వరి చొరవతో నిమ్మకూరును వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిమ్మకూరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
'నాడు-నేడు' పేరుతో ఉన్నవాటిని తవ్వేశారు - విద్యార్థులకు తప్పని తిప్పలు
శిథిలావస్థకు ప్రభుత్వ గురుకుల పాఠశాల - ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు

