గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ సేవలు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం
రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీలలో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు - సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు - రూ.2,432 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 10:12 PM IST
Digital Connectivity in Rural Areas : రాష్ట్రంలో ఏపీ ఫైబర్ నెట్కు పూర్వవైభవం తీసుకువచ్చేలా కీలక ప్రక్రియకు ముందడుగు పడింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలుకు అడుగు పడింది. డిజిటల్ భారత్ నిధి-రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు ప్రారంభమయ్యాయి.
సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సమక్షంలో డిజిటల్ భారత్ నిధి-ఏపీ ప్రభుత్వం MOU చేసుకుంది. MOUపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐ అండ్ ఐ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సంతకాలు చేశారు. కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత్ నెట్ ప్రాజెక్ట్కు రూ.2,432 కోట్లు : గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రా బలోపేతం, గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేలా సహకార ఒప్పందం కుదిరింది. భారత్ నెట్ ప్రాజెక్ట్ను రాష్ట్రంలో రూ.2,432 కోట్ల మేర నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం SPV ఏర్పాటు చేసింది. రైట్ ఆఫ్ వే అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, క్షేత్ర స్థాయి సమన్వయానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించనున్నారు.
13,426 గ్రామ పంచాయతీలలో ప్రాజెక్టు అమలు : రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీలలో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 1,692 ఫేజ్-I పంచాయతీల్లోని నెట్ వర్క్ను అప్ గ్రేడ్ చేయడం, 11,254 ఫేజ్-II లోని గ్రామాల డిజటల్ కనెక్టివిటీని పూర్తి చేయడం ఇక కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. 3942 గ్రామాల్లో డిమాండ్ ఆధారంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచనుంది. డిజిటల్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ వంటి సేవలను మరింత బలోపేతం చేసేలా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించారు.
‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనం : వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్లు ముందుండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని, పార్శిల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవక్లను వినియోగించుకుంటామని అన్నారు. సరైన దారి చూపిస్తే వారు అద్భుతాలు చేస్తారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనం నేడు నిర్వహించారు. ఉత్తమ గ్రామీణ డాక్ సేవక్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, జోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్రం, రాష్ట్రం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో గ్రామీణ డాక్ సేవక్ల సేవలను కొనియాడారు.
"మేం చదువుకునేటప్పుడు తపాలాశాఖ అందించిన సేవలు మరిచిపోలేం. మా చిన్నప్పుడు అన్నింటికీ పోస్ట్మ్యాన్పైనే ఆధారపడే వాళ్లం. జ్యోతిరాదిత్య సింధియా హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు. వాజ్పేయీ హయాంలో గ్వాలియర్ రాజమాతతో కలిసి పనిచేశాం. మాధవరావు సింధియాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. గాజువాకలో ఒక ప్రాంతానికి సింధియా పేరు ఉంది. ఆనాడు వేసిన పునాది వల్లే హైదరాబాద్ గొప్ప నగరంగా మారింది." అని చంద్రబాబు తెలిపారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - వివిధ సంస్థలతో ఏపీ 7 ఒప్పందాలు
ఏఐ సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన దారుణం: సీఎం చంద్రబాబు

