2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి: మంత్రులు కొల్లు, జనార్ధన్ రెడ్డి
మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హర్బర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, కొల్లు రవీంద్ర - పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 7:10 PM IST
|Updated : January 7, 2026 at 9:02 PM IST
Ministers Review on Construction Works of Machilipatnam Port: మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులపై మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, కొల్లు రవీంద్రలు సమీక్షించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షకు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. పనుల పురోగతిని మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. 2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టును అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రులు స్పష్టం చేసారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోర్టు పనుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులన్నింటినీ పరిష్కరించి పనుల్లో వేగం పెంచినట్టు తెలిపారు. ఇప్పటికే 50 శాతం పోర్టు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్ను కూడా ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో సరైన డిజైన్లు ఇవ్వకపోవడం వల్ల హార్బర్ పనుల్లో కొంత జాప్యం జరిగిందని ఇటీవలే ఐఐటీ చెన్నై నుంచి కొత్త డిజైన్ వచ్చిందని ఆ కొత్త డిజైన్ ద్వారా సీ మౌత్ను ఓపెన్ చేసి పనులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్కు స్వర్గీయ మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావు పేరు పెడుతూ జీవో జారీ చేయడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేసారు.
2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే పోర్టు పనుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులన్నింటినీ పరిష్కరించి పనుల్లో వేగం పెంచాం. పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయానికి ఆపరేషన్లోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించాం. ఫిషింగ్ హార్బర్ను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తాం. దీనికి మాజీ మంత్రి స్వర్గీయ నడకుదిటి నరసింహరావు పేరు పెట్టడం సంతోషకరమైన విషయం.- బీసీ జనార్ధన్ రెడ్డి, మంత్రి
గతంలో మంత్రులు బీసీ జనార్ధన్రెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్ స్వయంగా హార్బర్ పనులను పరిశీలించారు. జూన్ 15 నాటికి హార్బర్లో ప్యాకింగ్, నిల్వలు, అంతర్గత రహదారులు, ఇతర సముదాయాలు పూర్తి చేసి మత్స్యకార పడవలు తిరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికీ మొండిగోడలతో భవనాలు, అధ్వానంగానే రోడ్లు ఉన్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లే సమయం ఆసన్నమైనా పనుల్లో పురోగతి కనిపించడం లేదు.
బ్రేక్వాటర్ నిర్మాణానికి ప్రణాళిక : హార్బర్లోని జెట్టీల వద్దకు పడవలు సులువుగా వచ్చేందుకు వీలుగా బ్రేక్ వాటర్ వాల్స్ నిర్మిస్తున్నారు. వాటి వద్ద గత ప్రణాళిక ప్రకారం సముద్రం లోపల కొంతదూరం వరకు వేసిన రాళ్లు కుంగిపోతున్నాయి. దీని కారణంగా ఆయా పరిసరాల్లో చేపట్టాల్సిన డ్రెడ్జింగ్ పనులు నిలిచిపోయాయి. ఇటీవలే ఐఐటీ మద్రాస్ బృందం హార్బర్ను పరిశీలించి నిర్మాణాలకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించిందని మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే పనులు మొదలుపెట్టి గడువులోగా పూర్తి చేయనున్నట్లు వివరించారు.
దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుమతి - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక క్లస్టర్లు - రూ. 1,220 కోట్లతో ప్రతిపాదనలు

