బీఆర్ఎస్ నేతలు vs మినిస్టర్స్ : సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన రాజకీయం
గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై చర్చకు సిద్ధం - గన్పార్క్కు వచ్చిన మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ - అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరిన హరీశ్రావు, ఇతర నేతలు - అడ్డుకున్న పోలీసులు

Published : July 2, 2026 at 11:37 AM IST
Telangana Ministers on BRS Allegations : సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చించేందుకు మంత్రులు అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ తదితరులు గన్పార్క్ వద్ద వేచి చూశారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
బీర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు : బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు నిజమైతే చర్చకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హాస్టళ్లలో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీశ్రావు, ప్రవీణ్కుమార్ ఆరోపణలు చేశారన్న ఆయన బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలని మండి పడ్డారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రజలందరికీ నిజం తెలియాలన్నారు. మొత్తం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరిపామని, నాలుగు శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు.
టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని కోరుతున్నట్లు చెప్పారు. పదేళ్లుగా మీరు చేసిన ప్రొక్యూర్మెంట్పై కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామన్న పొన్నం ఐపీఎస్ అధికారిగా చేసిన ప్రవీణ్కుమార్ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎవరో, ఏదో తప్పుడు సమాచారం ఇస్తే దానిపై మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
మీరు చేసిన వ్యాఖ్యలు నిజమైతే చర్చకు రావాలి. హాస్టళ్లలో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీశ్రావు, ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు. మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలందరికీ నిజం తెలియాలి. మొత్తం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరిపాం. నాలుగు శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్లు పిలిచాం. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చనే విషయం తెలియదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. - మంత్రి పొన్నం ప్రభాకర్
మేం కూడా చర్చకు సిద్ధం : మంత్రి జూపల్లి విసిరిన సవాల్కు చర్చకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఈ మేరకు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్కు వస్తానని మంత్రి జూపల్లి చెప్పారని, అందుకే కేటీఆర్ తెలంగాణ భవన్లో వేచి ఉన్నారని హరీశ్రావు చెప్పారు. అనంతరం మంత్రుల సవాల్పై చర్చించేందుకు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నేతలతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేరారు. పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
చర్చకు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని హరీశ్రావు పోలీసులను నిలదీశారు. గురుకుల టెండర్లలో అవినీతి జరిగిందన్న ఆయన, అందుకే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారని చెప్పారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే మీరు పారిపోతున్నట్లే లెక్క అని హెచ్చరించారు. గన్పార్క్కు నడుచుకుంటూ వెళ్తామంటూ కారు దిగి నడిచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు అలాగే ముందుకు వెళ్లడంతో హరీశ్రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
సీఎం రేవంత్తో చర్చకు సిద్ధం - డేట్, టైమ్ ఫిక్స్ చేయండి : కేటీఆర్
తెలంగాణను కాదని గుజరాత్ మోడల్ను ప్రశంసించడం తెలివిలేని చర్య : మాజీ సీఎం కేసీఆర్

