పోలవరం - నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు - 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ప్రతిపాదించామన్న మంత్రి నిమ్మల
పోలవరం - నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల వివరణ - గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 6:48 PM IST
|Updated : January 11, 2026 at 6:58 PM IST
Minister Nimmala on Polavaram Nallamalasagar Link Project: ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3,000 టీఎంసీలలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా పోలవరం - నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందని మంత్రి నిమ్మల ఈ సందర్భంగా అన్నారు.
పోలవరం - నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, న్యాయవాదులు, ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని మంత్రి నిమ్మల లీగల్ టీమ్కు సూచించారు.
200 టీఎంసీలు తీసుకునేలా ప్రతిపాదన: కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీలలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని తెలిపారు. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందని రామానాయుడు స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చని వివరించారు.
టెండర్లు ముందస్తు సన్నాహక చర్యే: వృథాగా సముద్రంలోకి పోతున్నటువంటి విలువైన నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని మంత్రి నిమ్మల తేల్చి చెప్పారు. కేంద్రానికి ప్రాజెక్ట్ ఫీజుబులిటీ రిపోర్ట్ సమర్పించాం, వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. డీపీఆర్కి సంబంధించిన టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్య మాత్రమేనని తెలిపారు. చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు చేపడతామని స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టులో జగన్ మోసం తెలియాలనే రైతులతో కలిసి సమీక్ష: మంత్రి నిమ్మల
ధవళేశ్వరం బ్యారేజ్కు కొత్త గేట్లు - రూ.150 కోట్లు కేటాయింపు

