అమరావతిలో శరవేగంగా పనులు -త్వరలోనే జీఎడీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు: మంత్రి నారాయణ
నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ - ముగింపు దశలో గ్రూప్-1, గ్రూప్-2 టవర్ల నిర్మాణ పనులు - 34525 ఎకరాలకు ప్లాట్స్ రైతులకు ఇచ్చామన్న మంత్రి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2026 at 11:59 AM IST
|Updated : May 12, 2026 at 2:25 PM IST
Minister Narayana Visit MLA and MLCs Quarters : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న ఆధునిక నివాస సముదాయాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం రాజధాని అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో క్వార్టర్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తాజాగా రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నిర్మాణ పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు త్వరలోనే జీఎడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన మంత్రి నారాయణ, పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఇంటిరియర్ పనులతోపాటు మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలకు ఆదేశించారు. అంతేకాకుండా గ్రూప్-1, గ్రూప్-2 టవర్ల నిర్మాణ పనులు ముగింపు దశలోకి వచ్చాయన్నారు. అమరావతిలో జరుగుతున్న పనులపై పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారన్నారు.
34525 ఎకరాలకు ప్లాట్స్ రైతులకు ఇచ్చామని తెలిపారు. కేవలం ఇక 674 మందికి మాత్రమే న్యాయపర చిక్కులు వల్ల రైతులకు ప్లాట్స్ ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ అన్నారు. కావాలని కొందరు అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూములు మాత్రమే ఇచ్చాం, ప్రభుత్వం ప్లాట్స్ ఇవ్వలేదు అని ప్రచారం చేసే వాళ్లు నిజాలు తెలుసుకోవాలని మంత్రి హితవుపలికారు.
"అధికారులు, మంత్రుల కోసం చేపట్టిన క్వార్యర్స్ నిర్మాణ పనులను జీఎడీకి అప్పగిస్తాం. బంగ్లాల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. సంబంధిత కాంట్రక్టు సంస్థలు మిగిలిన ఇంటిరియర్ పనులను వేగంగా పూర్తి చేయాలి. గ్రూప్-1, గ్రూప్-2 టవర్ల నిర్మాణ పనులు ముగింపు దశలోకి వచ్చాయి. పక్క రాష్ట్రాల వారు కూడా అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులపై మాట్లాడుకుంటున్నారు. కొందరు కావాలనే అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారు." - నారాయణ, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
12 టవర్లలో 288 క్వార్టర్లు : అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం మొత్తం 12 టవర్లలో 288 ఆధునిక ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. వీటిని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. క్లబ్ హౌస్, ఆసుపత్రి, స్విమ్మింగ్ పూల్, భద్రతా వ్యవస్థలు, సౌరశక్తి వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి వంటి సదుపాయాలు కల్పించనున్నారు.
రూ.524.70 కోట్ల నిధుల మంజూరు : రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం దాదాపు రూ.524.70 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పెండింగ్లో ఉన్న అంతర్గత విద్యుత్ పనులు, లిఫ్టులు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్లు, ప్లంబింగ్, ల్యాండ్స్కేపింగ్ తదితర పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరిశీలన : గతంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్మాణ పనులను పరిశీలించారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకొని భవనాలను దీర్ఘకాల అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని సూచించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ నివాస సముదాయాలు మంత్రుల క్వార్టర్స్తో పాటే ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూడాలని సూచించారు. స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటివి కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. సోలార్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, వేస్ట్ వాటర్ యూజెస్ వంటి అన్ని వసతులు ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, రాజ్ భవసన్లు కృష్ణా నది వెంబడి ఉంటాయన్నారు.
అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు - 2 ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

