వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు రాజధానిలో ప్రధాన రహదారుల పనులు పూర్తి: మంత్రి నారాయణ
వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్లో ఉన్న 46 వేల విద్యుత్ కనెక్షన్లు మంజూరు - 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు, ఉచిత వ్యవసాయ కనెక్షన్లు కోసం రూ. 839.44 కోట్లు ఖర్చు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 4:51 PM IST
Minister Narayana About Inner Road Developments: రాజధానిలోని ప్రధాన రహదారులు (ట్రంక్ రోడ్లు) ఏప్రిల్ 2027కి పూర్తి చేసేందుకు ప్రణాళిక చేశామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఇన్నర్రింగ్ రోడ్డులో 96.2. కి.మీ పొడవు, 75 మీటర్ల వెడల్పుతో 8+4 వరసల రోడ్డు నిర్మాణానికి డిజైన్ చేశామని మంత్రి తెలిపారు. దీని నిర్మాణం రెండు ఫేజ్లలో జరుగుతుందని, అది పీపీపీ విధానంలో చేపట్టినట్లు తెలిపారు. రాజధానిలోని ట్రంక్ రోడ్ల మౌలిక సదుపాయాలు ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, హడ్కో, నాబార్డ్, వివిధ సంస్థల ద్వారా రూ. 40,847 కోట్లు సమకూర్చామని మంత్రి వివరించారు.
2027 నాటికి అంతా సిద్ధం: ఇన్నర్ రింగ్రోడ్డు కోసం భూ సమీకరణ అయ్యాక అభివృద్ధి కోసం కనీసం 24 నుంచి 30 నెలల సమయం పడుతుందన్నారు. మొదటి ఫేజ్లో కేతనకొండ-నున్న వరకు, రెండో ఫేజ్లో నున్న-కేతనకొండ వరకు నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ వివరించారు.
మొదటి దశలో 67.6 కిలోమీటర్ల నిర్మాణం, గుంటూరు జిల్లాలో 14, పల్నాడులో 3, కృష్ణాలో 6, ఎన్టీఆర్లో జిల్లాలో 3 గ్రామాలు, మొత్తం 26 గ్రామాల ద్వారా నిర్మాణం జరుగుతుంది. దీనికోసం డీపీఆర్ కూడా సిద్ధమయ్యింది. ఈ నిర్మాణానికి భూ సమీకరణ కూడా ప్రారంభించాం. ఆరు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. 2027 నాటికి ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది.' -నారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి
200-500 యూనిట్లు ఉచితం: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు డిస్కంల పరిధిలో 1,02,538 కనెక్షన్లు ఇచ్చామన్నారు. వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్లో ఉన్న 46 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం రూ. 839.44 కోట్లు ఖర్చు చేశామన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని వివరించారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి రూ. 1,059 కోట్లు ఆదా అవుతుందన్నారు. ఏప్రిల్ నుంచి వీవర్స్కు 200- 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
పోస్టులు-ఖాళీలు: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ల కొరతపై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇస్తూ ఆ పోస్టుల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్ పోస్టులు 1260, అసిస్టెంట్ లైన్మెన్లు 1084, లైన్మెన్ పోస్టుల్లో 22 ఖాళీలు ఉన్నాయన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో 8770 మంది పని చేస్తున్నారన్నారు. లోడ్ ఆధారంగా విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
'ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా కథనాలు' - 'సాక్షి'కి రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు
డీఎస్సీలో కర్నూలుకు ఎక్కువ టీచర్లను మంజూరు చేశాం:మంత్రి లోకేశ్

