'ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయ విందు' - నేతల కుటుంబాలతో లోకేశ్ సరదా సంభాషణలు
2వ రోజు చిత్తూరు, అనకాపల్లి జిల్లాల కూటమి నేతలతో మంత్రి లోకేశ్ సమావేశం - ఆహ్లాదకర వాతావరణంలో నేతలతో ఆత్మీయ విందు -హోదాలతో సంబంధం లేకుండా అందరితో సరదా సంభాషణలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 10:50 AM IST
Minister Nara Lokesh meet Alliance Leaders: చంద్రబాబుతో రాజకీయ సమీక్ష అంటే పార్టీ నేతలకు భయం, ఆత్మీయత అంటే బలం. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ కొత్త సంస్కృతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లు నాంది పలికారు. నియోజకవర్గాల వారీగా సర్వేలను ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యేల పనితీరు గురించి చంద్రబాబు చర్చిస్తున్నారు. అదే వేదికపై రాజకీయాల్ని పక్కన పెట్టి నేతల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందుల్లో యోగక్షేమాలను లోకేశ్ తెలుసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరుగుతున్న ఈ సమీక్షలు కేవలం పనితీరు అంచనాలే కాకుండా పార్టీకి దిశానిర్దేశం చేసే వ్యూహ రచనలకు, దారి తప్పే నేతలకు గట్టి హెచ్చరికగా, కట్టుబాటుతో ముందుకు సాగే వారికి ప్రోత్సాహంగా నిలుస్తున్నాయి. క్రమశిక్షణ, ఆత్మీయతతో ఐక్యత ధోరణితో తెలుగుదేశం అధిష్టానం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ప్రజా ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయానికి కొత్త దిశా నిర్దేశం చేస్తూ పాలనకు వేగం జోడించే కార్యాచరణను అమలు చేస్తున్న చంద్రబాబు మరోసారి తన ప్రత్యేక పరిపాలనా ముద్రను చాటుతున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రతి రోజూ ఒక జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్చార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక సమస్యల సత్వర పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకత్వం ఇస్తున్నారు. సంక్షేమం–అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కూటమి ప్రభుత్వ ముద్ర స్పష్టంగా కనపడేలా, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పెరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై లోతైన చర్చలు చేపట్టారు. సీఎం సమావేశాల అనంతరం అదే జిల్లా నేతలతో నారా లోకేశ్ నిర్వహించే డిన్నర్ మీటింగ్లు ఆత్మీయతను పెంచి, సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.
వ్యక్తిగతంగా ఎదురెళ్లి స్వాగతం: 'అభిమాన ఆహ్వానం - ఆత్మీయ ఆతిథ్యం' నినాదంతో రాజకీయాలకు అతీతంగా కుటుంబ బంధాలను బలపరుస్తూ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. వ్యక్తిగతంగా వారికి ఎదురెళ్లి స్వాగతం పలికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. స్పీకర్, మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్న తేడా లేకుండా కుటుంబసభ్యుల్లా కూర్చొని సరదా సంభాషణలతో గడిపారు.
రాజకీయ సమీకరణాలకు మించి మానవీయ అనుబంధానికి ప్రతీకగా ఈ సమావేశం నిలిచింది. ప్రజాప్రతినిధులు అందచేసిన వినతుల ప్రగతి ఏ దశలో ఉందో నివేదిక రూపంలో స్వయంగా అందచేస్తూ సమస్యల పరిష్కారంపై తన నిబద్ధతను లోకేశ్ చాటారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు కానుకగా అందించి ఆతిథ్యానికి ప్రత్యేక ముద్ర వేశారు. విందు అనంతరం అతిథులందరినీ గేటు వరకూ సాగనంపారు. నేతల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచిన ఈ సమావేశం, కూటమి బంధాలను బలోపేతం చేసే ఆత్మీయ రాజకీయానికి చిరునామాగా నిలిచింది.
హాజరైన 2 జిల్లాల నేతలు: ఈ ఆత్మీయ సమావేశానికి అనకాపల్లి జిల్లా నుంచి ఎంపీ సీఎం రమేష్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామక్రిష్ణ, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్లు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. అలానే చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్, జిడి నెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణిప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్లు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.
ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్ - ఏం తినాలి, ఏం చేయాలో చెబుతుంది: సీఎం చంద్రబాబు
'సమస్యలపై వేగంగా స్పందించండి' - జిల్లా నేతలు, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

