తెలంగాణ ప్రాజెక్టులకు మేం ఎక్కడా చిల్లు పెట్టలేదు - ఆ నీళ్లు వాడుకుంటే తప్పేంటి?: మంత్రి లోకేశ్
సముద్రంలో కలిసే వేల టీఎంసీలు కాపాడి రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటన్న లోకేశ్ - మిగిలిన నీళ్లను తెలంగాణ వాడుకోవచ్చు, చెన్నైకు ఇవ్వొచన్న మంత్రి లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 6:42 PM IST
Minister Lokesh Visakhapatnam Tour : పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటని మంత్రి లోకేశ్ అన్నారు. తక్కువ ధరకు భూములు ఇస్తుండటం వల్లే పెద్ద కంపెనీలు విశాఖకు వస్తున్నాయని చెప్పారు. సాక్షి పత్రిక ప్రచురించిన కథనంపై పరువునష్టం దావా వేసిన కేసులో విశాఖ వెళ్లిన లోకేశ్ మీడియాతో మాట్లాడారు. యువతకు ఉద్యోగ కల్పన తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరలించలేకపోయిందని లోకేశ్ అన్నారు. అలాగే ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే టాప్లో ఉన్నామని గుర్తు చేశారు.
"అమరావతికి మంచి విమానాశ్రయం కావాలి. అందుకే భూసేకరణ చేస్తున్నాం. ప్రాజెక్టుల పూర్తికి సమయం పడుతుంది. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఎకరం 99 పైసలకే ఇస్తున్నారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటి. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలి. ఆర్థిక రాజధాని విశాఖే. అందుకే ఇక్కడకి పెట్టబడులు వస్తున్నాయి. విశాఖకు ఐటీ, ఫార్మా, డేటా సెంటర్, స్టీల్ సిటీలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనేదే కూటమి ప్రభుత్వ విధానం. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టం" అని లోకేశ్ స్పష్టం చేశారు.
ఆ నీటిని రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటి : "సముద్రంలో కలిసే వేల టీఎంసీలు కాపాడి రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటి? తెలంగాణ ప్రాజెక్టులకు మేం ఎక్కడా చిల్లు పెట్టలేదు. మిగిలిన నీళ్లను తెలంగాణ వాడుకోవచ్చు, చెన్నైకు ఇవ్వొచ్చు. గతంలో పట్టిసీమ దండగని జగన్ అన్నారు. దాన్నే ఐదేళ్లు వాడుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది" అని మంత్రి లోకేశ్ అన్నారు.
"ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సమయం పడుతుంది. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు వేగంగా అభివృద్ధి. అమరావతికి చట్టబద్ధత ఉంది కనుకే దాన్ని తరలించలేకపోయారు. బడా కంపెనీలకు తక్కువధరకు భూములిస్తే తప్పేంటి?. పెట్టుబడులు పెరగాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయి. సముద్రంలో కలిసే వేల టీఎంసీలు కాపాడి రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటి. తెలంగాణ ప్రాజెక్టులకు మేం ఎక్కడా చిల్లు పెట్టలేదు. మిగతా నీళ్లను తెలంగాణ కూడా వాడుకోవచ్చు, చెన్నైకు ఇవ్వవచ్చు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ, అందుకే ఇక్కడకు పెట్టుబడులు. విశాఖకు ఐటీ, ఫార్మా, డేటా సెంటర్, స్టీల్ సిటీలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ విధానం. టాప్ ఐటీ కంపెనీలను విశాఖకు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రౌడీషీటర్లను రోడ్లపై ఊరేగిస్తున్నాం." - మంత్రి నారా లోకేశ్
‘సాక్షి’ పత్రికపై పరువు నష్టం కేసు : అంతకుముందు మంత్రి నారా లోకేశ్ విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ‘సాక్షి’ పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్కు ఆయన వచ్చారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాగా మూడోసారి హాజరయ్యారు. తన పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశంతో ఆ పత్రికలో తప్పుడు కథనం రాశారంటూ కోర్టులో ఆయన గతంలో దావా వేశారు.
విశాఖలో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్కు : విశాఖపట్నం పర్యటనలో భాగంగా నేడు విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్ నిర్వహించారు. దీంతో మంత్రి లోకేశ్ను కలిసి వినతులు ఇచ్చేందుకు ప్రజలు క్యూ కట్టారు. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల నిర్మాణం, ఆర్థికసాయం, తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపు, భూ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.
విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలి: మంత్రి లోకేశ్
పార్టీ ఆదేశాలను తప్పక పాటించాల్సిందే - ఆ ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్ : మంత్రి లోకేశ్

