బాధితులు త్వరగా కోలుకునేందుకు ముంబై, చెన్నై నుంచి ప్రత్యేక మెడిసిన్: వీరపాండియన్
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వీరపాండియన్ కీలక వ్యాఖ్యలు - పోలీసు ఫోరెన్సిక్ బృందం కూడా నమూనాలు సేకరించిందని బాధితులు కోలుకునేందుకు మెరుగైన ఔషధాలు ఇస్తున్నామని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 7:50 PM IST
Health Commissioner on Rajahmundry Milk Incident: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన బాధితులకు మొదట పాల రుచి చేదుగా ఉన్నట్టు తెలిసిందని ఆ తరువాత మూత్రం ఆగిపోయిందని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వీరపాండియన్ వెల్లడించారు. ఒకే కుటుంబం నుంచి రోగులు రావడంతో ఆ ఆసుపత్రి నుంచి డీఎంహెచ్వోకు ఫిర్యాదు వచ్చిందని వైద్యులు అన్యూరియాగా గుర్తించారని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం నలుగురు మరణించారని అన్నారు. మొత్తం 106 కుటుంబాలకు సూచనలు ఇచ్చామని 315 మంది నుంచి రక్త నమూనాలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 15 మంది ఆసుపత్రిలో ఉండగా వారిలో 8 మంది పరిస్ధితి క్లిష్టతరంగా ఉందని వీరపాండియన్ తెలిపారు.
చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని వీరపాండియన్ తెలిపారు. 10 ఫుడ్ శాంపిల్స్ సేకరించి ప్రభుత్వ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్, ఓ ప్రయివేట్ ల్యాబ్ లకు పంపామని వాటి ఫలితాలు 48 నుంచి 72 గంటల్లో వస్తాయని వివరించారు. మరణించిన వారి నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకుని టెస్ట్కు పంపామని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు ముంబై, చెన్నై నుంచి ప్రత్యేక మెడిసిన్ తెప్పిస్తున్నామని అవి ఈ రోజు రాత్రికి రాజమండ్రి చేరుకుంటాయని వెల్లడించారు. ఆ ప్రాంతంలో శాశ్వతంగా 14 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి పూర్తి సర్వీయలెన్స్ చేస్తున్నామని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు పరిస్థితిని పరిశీలిస్తామని కల్తీ జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుందని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాలపై తనిఖీలు: పాల శీతలీకరణ కేంద్రంలో ఒక లీకేజీ గమనించారని ఘటన జరిగిన తరువాత రోజే అక్కడ రిపేర్లు జరిగాయని వీరపాండియన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాల శీతలీకరణ కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. లైసెన్స్ లేకుండా పాలశీతలీకరణ కేంద్రాలు ఉంటే వాటిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఫుడ్ కంట్రోలర్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు ఐపీఎం డైరెక్టర్ నీలకంఠ రెడ్డి తెలిపారు. పాల ఉత్పత్తులు అమ్మే వారికి లైసెన్స్లు ఉండాలని స్పష్టం చేశారు. ఫుడ్ కంట్రోల్ విభాగం, ల్యాబ్, ఫీల్డ్లో సిబ్బంది కొరత ఉన్న మాట నిజమేనని అన్నారు. రాజమండ్రి ఘటన డెయిరీలో శాంపిల్స్ తీశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాలపై తనిఖీలు చేస్తామని ఆరోగ్య శాఖ కమీషనర్ వీరపాండియన్ వెల్లడించారు.
''పాల కల్తీ ఎలా జరిగిందనేది విచారణలో తేలుతుంది. ఇంకా కొన్ని పరీక్షలు చేయించాం నివేదికలు రావాల్సి ఉంది. పోలీసు ఫోరెన్సిక్ బృందం కూడా నమూనాలు సేకరించింది. బాధితులు కోలుకునేందుకు మెరుగైన ఔషధాలు ఇస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో మరో నెలపాటు పరిస్థితులు పర్యవేక్షిస్తాం. కూలెంట్ ఉన్నచోటే ఏదైనా జరిగిందా అని మాకు అనుమానం. అవే పాలు తాగిన కొందరు రైతులు మాత్రం బాగానే ఉన్నారు. గణేశ్ నుంచి పదేళ్లుగా పాలు పోయించుకుంటున్నారు. పాల రుచిలో తేడా వచ్చింది తొలుత వాంతులు అయ్యాయి. పాలు తాగడం వల్లే ఇలా జరిగిందని అధికారులకు చెప్పారు.'' - వీరపాండియన్, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్
పాలు కల్తీ చేస్తే మరణ శిక్ష - ఫుడ్ సేఫ్టీ అధికారుల హెచ్చరికలు
అనధికారికంగా వరలక్ష్మి డెయిరీ నిర్వహణ - కొంపముంచిన కూలెంట్ లీకేజీ

