యూట్యూబ్లో చూసి పక్కాగా హత్య చేశాడు - కానీ పోలీసులకు ఈజీగా దొరికిపోయాడు
కరీంనగర్ జిల్లాలో జరిగిన హత్యకేసును ఛేదించిన పోలీసులు - జూన్ 27న దారుణహత్యకు గురైన వ్యక్తి - యూట్యూబ్లో చూసి మరి దారుణంగా చంపిన నిందితుడు - రోజుల వ్యవధిలోనే నిందితుడుని పట్టుకున్న పోలీసులు

Published : July 6, 2026 at 3:40 PM IST
Man arrested for murder after watching YouTube : హత్య ఎలా చేయాలి? అందుకు ఉపయోగించే ఆయుధాలు, నేరం చేశాక తప్పించుకోవడం ఎలా? అనే విషయాలపై ఓ వ్యక్తి యూట్యూబ్లో శోధించాడు. ఎట్టకేలకు అనుకున్న వీడియో అతడి కంట పడింది. ఇంకేముంది దాంట్లో ఉన్నట్లుగానే చేశాడు. తన పథకాన్ని పక్కాగా అమలు చేశాడు. మాటువేసి ఇనుపరాడ్డుతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపి చివరకు ఓ వ్యవసాయ బావి వద్ద పడేసి ఎమీ ఎరగనట్లు నటించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కలకలం రేపిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. అసలింతకీ ఎందుకీ హత్య చేశాడు? చివరకి ఎలా పట్టుబడ్డాడు? అనే విషయాలు కథనంలో తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం : కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో అంకుశాపూర్నకు చెందిన పైతరి మొగిలి అనే వ్యక్తి జూన్ 27న దారుణ హత్యకు గురయ్యాడు. తలపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతను చనిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొగిలి భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడి భార్య ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో మడిపల్లికి చెందిన గంగారపు మహేశ్ అనే వ్యక్తిని పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు. జూన్ 29 తేదీన మడిపల్లిలోనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సోషల్ మీడియాలో చూసి దారుణహత్య : పైతరి మొగిలి ఫిబ్రవరిలో మడిపల్లికి చెందిన ఓ వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సదరు మహిళ మహేశ్ అండతో పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో మొగిలి 2 నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల విడుదలైన మొగిలి తరచూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవాడు. బాధితురాలికి మహేశ్ అండగా నిలిచినందుకు అతడి కుటుంబంలో, వివాహిత కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. మహేశ్ తన భార్యకు, వివాహిత ఆమె భర్తకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబ కలహాలకు, మానసిక వేదనకు కారణమవుతున్నాడన్న నెపంతో మొగిలిని ఎలాగైనా హత్య చేయాలని మహేశ్ భావించాడు. అందుకోసం హత్యలు చేయడం ఎలా? అందుకు ఉపయోగించే ఆయుధాలు, వాటి తయారీ, నేరం చేశాక తప్పించుకోవడం ఎలా ఇలాంటి వీడియోలు యూట్యూబ్లో చూశాడు. అందులో చెప్పిన ప్రకారమే హత్యకు స్కెచ్ వేశాడు.
కేసును ఛేదించిన పోలీసులు : పీర్లపండగ సందర్భంగా మడిపల్లికి వచ్చిన మొగిలి గమనించాడు. ఇనుపరాడ్ తీసుకుని మడిపల్లి నుంచి అంకుషాపూర్ వెళ్లే దారిలో మద్యం తాగుతూ కాపుకాశాడు. రాత్రి 11గంటల 45 నిమిషాల సమయంలో మొగిలి సైకిల్ పై వెళ్తుండగా ఇనుపరాడ్తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయాలపాలైన మొగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతి చెందాడని నిర్ధారించుకొని మడిపల్లి శివారులోని తన వ్యవసాయ బావి వద్ద రాడ్ పడేసి ఇంటికి వెళ్లి దుస్తులను మార్చుకున్నాడు. మొగిలి భార్య ఫిర్యాదుతో మహేశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడు. హత్యకు వినియోగించిన రాడ్, మహేశ్ ధరించిన దుస్తులు, ద్విచక్రవాహనం, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. జమ్మికుంట సీఐ ఎస్.రామకృష్ణ ఆధ్వర్యంలో కేసు ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు
ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య - వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే
వివాహేతర బంధానికి కుమారుడే అడ్డు - ప్రియుడితో కలిసి చంపిన తల్లి

