02-06-2026 Telangana News Today Live Updates : పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్టు : పొన్నం ప్రభాకర్

Published : June 2, 2026 at 7:08 AM IST
|Updated : June 2, 2026 at 10:52 PM IST
02-06-2026 Telangana News Today Live Updates : ఈరోజు తెలంగాణ తాజా ప్రధాన వార్తల సమాచారం.
LIVE FEED
వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీకి పాలకవర్గం నియామకం
వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీకి పాలకవర్గం నియామకం జరిగింది. మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్గా ప్రియాంక, వైస్ ఛైర్పర్సన్గా జనార్దన్ను ఎంపికయ్యారు. ఇప్పటివరకు 191 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ట్రాన్స్జెండర్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సకు సీఎంఆర్ఎఫ్ నిధులు
ట్రాన్స్జెండర్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సకు సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ట్రాన్స్జెండర్కు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్కు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇవ్వడం దేశంలో తొలిసారని క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ పేర్కొంది. సీఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులుకు క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.
హైదరాబాద్: శంషాబాద్లోని లిమ్స్ ఆస్పత్రిలో మంటలు
శంషాబాద్లోని లిమ్స్ ఆస్పత్రిలో మంటలు చెరరేగాయి. ఆపరేషన్ థియేటర్లో మంటలు రావడంతో వెంటనే రోగిని అక్కడి నుంచి ఆస్పత్రి సిబ్బంది తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.
సీఎం పర్యటన.. పాలమూరు నీటిపారుదల గమనాన్ని నిర్దేశించే మైలురాయి: ఉత్తమ్
సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పర్యటన దృష్ట్యా హైదరాబాద్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి, శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఇంజినీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం పర్యటన.. పాలమూరు నీటిపారుదల గమనాన్ని నిర్దేశించే మైలురాయి అని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి సీఎం దిశానిర్దేశం చేస్తారని, కీలక ప్రాజెక్టుల విధాన నిర్ణయాలు, అనుమతులు, నిధుల విడుదలకు అవకాశం ఉందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నీటిపారుదల స్వరూపం మార్చే పర్యటనగా ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక ధోరణి: రామచందర్రావు
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు. జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక ధోరణి అని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్ సెట్కు ఇది నిదర్శనం అని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారం, స్నేహభావంతో ముందుకెళ్లాలని రామచందర్రావు ఆకాంక్షించారు.
తెలంగాణ భవన్లో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
దిల్లీ తెలంగాణ భవన్లో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ ఆరంభం నుంచే మద్దతు ఇచ్చిందని నితిన్ గుర్తుచేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు ద్వారా అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే బీజేపీ ఎప్పటి నుంచో పనిచేస్తోందన్నారు. కిషన్రెడ్డి, రామచందర్రావు, బీజేపీ ఎంపీలు హాజరైన ఈ సదస్సులో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫొటో ఎగ్జిబిషన్, తెలంగాణ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
పవన్కల్యాణ్ మాటల్లో స్పష్టత లేదు: బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి
పవన్కల్యాణ్ మాటల్లో స్పష్టత లేదని బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి విమర్శించారు. తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్, జనసేన కలిసి నాటకాలు ఆడుతున్నాయని, సమస్యలను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్రెడ్డి ఆరోపించారు. మోదీ రాసిచ్చారు.. పవన్ కల్యాణ్ చదివారని జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజల నరదిష్టి తగిలిందని ఎవరు చెప్పారు : కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి
తెలంగాణ ప్రజల నరదిష్టి తగిలిందని ఎవరు చెప్పారని కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ప్రెస్మీట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కల్యాణ్ తిరిగారని, చిరంజీవి అంటే మాకు అభిమానం అని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలను రక్షిస్తూ పవన్ కాంగ్రెస్పై వ్యాఖ్యలు చేశారన్నారు.
పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్టు : పొన్నం ప్రభాకర్
"పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్టు. నా వద్ద డబ్బులుంటే పాత్ర ఇచ్చి ఇలా మాట్లాడించవచ్చు. బీజేపీ లేదా బీఆర్ఎస్ నుంచి చిట్టీలు వస్తున్నాయా తెలియదు. నేను ఎవరినీ అవమానించను. ఏపీ ప్రజలను కూడా. విభజన సమస్యలు సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలని చూస్తా. చాలా మంది రాజకీయంగా పోటీ చేస్తున్నారు. ఎవరికీ అభ్యంతరం లేదు. కొండగట్టుకు డబ్బులిచ్చినట్లు చెబుతున్నారు. నీ అయ్య జాగీరా? తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం వస్తే మరో మాట మాట్లాడుతారా?" అంటూ పవన్ కల్యాణ్పై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీకి మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
మహారాష్ట్ర రైతులకు ఆ రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 56 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఎల్లుండి కేరళలోకి నైరుతి - వారం రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం
నైరుతి రుతుపవనాలు ఎల్లుండి కేరళలోకి ప్రవేశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళను తాకిన వారం రోజులకు తెలంగాణలోకి(Monsoon update) ప్రవేశించే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 91 మంది ఖైదీలు విడుదల
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన గల 91 మంది ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. జీవోఎంఎస్ 54 ద్వారా ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ విడుదలైన వారిలో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. వీరంతా చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు.
'సర్' ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
'సర్' ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఓటరు జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, అలాగే రాష్ట్రంలో పంటల వైవిధ్యతపై రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై అవగాహన కల్పించే విషయంలో కూడా సీఎస్ దిశానిర్దేశం చేశారు.
పోక్సో కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
పోక్సో కేసులో దోషికి నాంపల్లి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చాంద్రాయణగుట్టలో 2023లో బాలికపై లైంగికదాడి చేసిన మహ్మద్ జమీరుద్దీన్(70ఏళ్లు)కు 20 ఏళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. దోషికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.5 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
సర్పై దృష్టి పెట్టాలి.. ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి: భట్టి
సర్పై మీడియా దృష్టి పెట్టాలని, ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Dy CM Bhatti Chitchat) సూచించారు. ఖమ్మంలోని మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు మ్యాపింగ్పై దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మాకు ప్రత్యర్థులే లేరన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని, పని చేసే పార్టీలకు ప్రచారం అవసరం లేదన్నారు.
జనసేన హౌస్మోషన్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు రిజిస్ట్రీ
జనసేన హౌస్మోషన్ పిటిషన్ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించారు. తమ పార్టీ సమావేశానికి అనుమతి ఇవ్వాలని జనసేన హౌస్మోషన్ పిటిషన్(Janasena Housemotion Petition) వేసింది. అయితే సమయం లేనందున రిజిస్ట్రి దీనిని తిరస్కరించారు. జనసేన సమావేశానికి పోలీసులు ఇప్పటికే అనుమతి నిరాకరించడంతో జనసేన ఇవాళ హైకోర్టును ఆశ్రయించింది.
మెదక్: వెల్దుర్తి మండలం దామరంచలో అగ్నిప్రమాదం
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అంటుకుని రోడ్డు పక్కన ఆరబెట్టిన రైతు నాచారం మహేశ్కు చెందిన 40 బస్తాల ధాన్యం దగ్ధం అయ్యింది. దామరంచ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డికి నిప్పుపెట్టారు. గాలికి మంటలు వ్యాపించి వడ్ల కుప్ప, ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని మహేశ్ వేడుకుంటున్నారు.
పవన్ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు : మహేశ్ కుమార్ గౌడ్
నటుడిగా పవన్ కల్యాణ్ను అందరం అభిమానిస్తామని, రాజకీయంగా మాత్రం వ్యతిరేకిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief on PAVAN) పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడన్న ఆయన, పవన్ కల్యాణ్ ఏపీకి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారని, పవన్ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ అగ్రనేతలతో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై భేటీ
బీజేపీ అగ్రనేతలతో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై భేటీ అయ్యారు. దిల్లీలో నితిన్ నబీన్తో పాటు బి.ఎల్.సంతోశ్ను కలిశారు. అన్నామలై కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తారన్న ఊహాగానాల వేళ, సమావేశంలో ఏం చర్చించారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జనసేన
హైకోర్టులో జనసేన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జనసేన సభకు పోలీసులు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరింది. జనసేన నేతల హౌస్మోషన్ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా, తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని పిటిషన్ దాఖలు చేసిన పాశం యాదగిరి కోరారు.
భద్రాద్రి జిల్లా: తాలిపేరులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
భద్రాద్రి జిల్లా తాలిపేరులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. దండుపేట సమీపాన చేపల వేటకు వెళ్లి నీట మునిగిన తండ్రి, కుమారులు మృత్యువాతపడ్డారు. మృతులు మొగలపల్లికి చెందిన సూర్యారావు, కుమారుడు భార్గవ్గా గుర్తించారు.
రైతుల నుంచి రూ.11 కోట్లు వడ్డీకి తీసుకున్న వ్యాపారి - 60 మందికి కుచ్చుటోపీ
సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ స్థిరాస్తి వ్యాపారి డబ్బులు సేకరించి పరారయ్యాడు. కోదాడలో 60 మందికి కుచ్చుటోపీ పెట్టిన స్థిరాస్తి వ్యాపారి జితేందర్రెడ్డి, పలువురు రైతుల నుంచి రూ.11 కోట్లు వడ్డీకి తీసుకున్నారు. ఏడాది వరకు డబ్బు ఇవ్వలేననంటూ రుణాదాతలకు నోటీసులు పంపించాడు. దీంతో స్థిరాస్తి వ్యాపారి ఇంటి ముందు టెంట్ వేసి రుణదాతలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారి జితేందర్ రెడ్డి పరారీలో ఉన్నారు.
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లారీ కింద కారు ఇరుక్కుపోయి మహిళ సహా ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రులు మణుగూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇవాళ సాయంత్రం 4.30 గం.కు పవన్ కల్యాణ్ మీడియా సమావేశం
ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో జనసేన నాయకులతో కలిసి పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించిన పవన్, మీడియా సమావేశానికి పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నానన్నారు.
కాసేపట్లో సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
కాసేపట్లో సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురితో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించనున్నారు. ఐదుగురి ప్రమాణంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 37కు పెరగనుంది.
నాగర్కర్నూల్: కల్వకుర్తి మండలం తాండ్ర వద్ద రోడ్డుప్రమాదం
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడి ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.
తెల్లవారుజామున అగ్నిప్రమాదం - ఇద్దరు మహిళలు సజీవదహనం
ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడులో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల ధాటికి ఇద్దరు మహిళలు సజీవదహనమయ్యారు. నిద్రిస్తున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకోగా, మంటల ధాటికి వలగాని సావిత్రి(60), తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన సావిత్రి అక్క సిగ పూలమ్మ(65) మృతి చెందారు. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా, మంటలు వ్యాపించి పొరుగునే ఉన్న మరో ఇల్లు పాక్షికంగా దగ్ధమయ్యింది.
సికింద్రాబాద్: ఓల్డ్బోయిన్పల్లి లో ఓ భవనంలో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్లోని ఓల్డ్బోయిన్పల్లిలో ఓ భవనం రెండో అంతస్తులోని గదిలో అగ్నిప్రమాదం(Fire in Secunderabad) సంభవించింది. సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసిన కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పారు.
డ్రైనేజీ పైపు విషయమై జరిగిన ఘర్షణ కేసులో ముగ్గురికి జైలు శిక్ష
డ్రైనేజీ పైపు విషయమై జరిగిన ఘర్షణ కేసులో రెండో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(Judicial Magistrate Court) ముగ్గురు నిందితులకు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. అబిడ్స్లో ఇంటి ముందు డ్రైనేజీ పైపు ఏర్పాటుపై ఇరుగుపొరుగు వారి మధ్య 2020లో ఘర్షణ తలెత్తగా పోలీసులు కేసు నమోదు చేశారు.

