ఆ పని చేయకపోతే నో గ్యాస్ సిలిండర్, నో సబ్సిడీ - ఇంకా 2 నెలలే టైమ్
ప్రతి ఇంట్లో పెరిగిన గ్యాస్ వినియోగం- ఈ కేవైసీ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం - మార్చి 31తో ముగుస్తున్న గడువు - కేవైసీ పూర్తి చేయకపోతే నో గ్యాస్ సిలిండర్, నో సబ్సిడీ

Published : January 6, 2026 at 12:14 PM IST
LPG Connections KYC : ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ మన నిత్యావసరాల్లో ఒక భాగంగా మారింది. గతంలో గ్యాస్ కలెక్షన్ కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం ఈజీగా కలెక్షన్ పొందుతున్నారు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గృహ అవసరాల కోసం ఎల్పీజీ కనెక్షన్లకు కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ఆయా గ్యాస్ సంస్థలు ఎల్పీజీ కనెక్షన్లకు కేవైసీ తప్పనిసరి కార్యక్రమం అమలు చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఎల్పీజీ వినియోగదారులు కేవైసీ చేస్తున్నా, ఇంకా ఎక్కువ మంది కేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తోంది.
దీని ఫలితంగా సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ బుకింగ్ కూడా నిలిచిపోయే అవకాశాలు ఉన్నట్లు గ్యాస్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ప్రధానంగా రాయితీ పొందుతున్న వారు కేవైసీని పూర్తి చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నకిలీ, డూప్లికేట్ గ్యాస్ కనెక్షన్లను తొలగించేందుకు కేవైసీ తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందించడంలో భాగంగా ప్రతి డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారుడు కేవైసీని పూర్తి చేయాల్సిందే అని స్పష్టం చేసింది.
ఎవరెవరు అర్హులు? :
- సాధారణ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు
- ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులు
- సబ్సిడీ పొందుతున్న అందరూ
చేసుకోవడం ఎలా? :
- ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా కేవైసీ చేస్తారు.
- గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులే కేవైసీ పూర్తి చేస్తున్నారు.
- గ్యాస్ ఏజెన్సీ వద్ద లేదా ఆన్లైన్లో కేవైసీ పూర్తి చేయవచ్చు.
- గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్లోనూ కేవైసీని పూర్తి చేయవచ్చు.
అవసరమైన ధ్రువపత్రాలు :
- ఆధార్ కార్డు(మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి)
- గ్యాస్ కస్టమర్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, చిరునామా
ఈ-కేవైసీ మార్చి 31వ తేదీలోపు పూర్తి : ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ-కేవైసీ మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలి. ఇలా చేస్తే ఆ సబ్సిడీ తిరిగి చెల్లిస్తారు. లేదంటే అది శాశ్వతంగా రద్దు అవుతుంది. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
ధ్రువీకరణ తర్వాత సబ్సిడీ : ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ-కేవైసీ చేయించడం తప్పనిసరి. ఏడాదికి గరిష్ఠంగా 9 సిలిండర్లకు మాత్రమే కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. అయితే 8,9వ సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు ముందు ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ ఇస్తోంది. ఒకవేళ ధ్రువీకరణ ఆలస్యం అయితే దానిని తాత్కాలికంగా నిలిపివేస్తారు.
అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారం : గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కు వెళ్లి లేదా సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే ఈ యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సబ్సిడీ, ఈ-కేవైసీ ప్రక్రియ లేదా బయోమెట్రిక్ ధ్రువీకరణ పద్ధతులపై పూర్తి వివరాలను www.pmuy.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇలా మూడింటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.
తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు : రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్కార్డుల ఆధారంగా గ్యాస్ సబ్సిడీకి 39.57 లక్షల మంది అర్హులు. ప్రతి ఏడాది రాయితీ ఇవ్వాల్సిన వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉంటుంది. ఇందుకు మొత్తం సబ్సిడీ కింద రూ.855.22 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ఆ మేరకు నిధులను బడ్జెట్లో కేటాయించారు.
ఈ కొత్త గ్యాస్ సిలిండర్ పేలదు! - బరువు చాలా తక్కువ!!
గ్యాస్ ప్రమాదం జరిగిందా? - రూపాయి కట్టకుండానే రూ.30 లక్షలు బీమా పొందొచ్చని తెలుసా?

