ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్ - సంక్రాంతికి 1,387 స్పెషల్ బస్సులు మీ కోసం
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్తున్నారా? - ప్రయాణికులకు తీపికబురు చెప్పిన టీజీఎస్ఆర్టీసీ - ప్రయాణికుల రద్దీ ఆధారంగా అవసరమైతే సర్వీసులు పెంచటానికి సన్నాహాలు

Published : January 7, 2026 at 12:45 PM IST
TGSRTC Special Buses for Sankranti : సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ తీపికబురు అందించింది. ఈ పండగ సమయాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలను చేరవేసేందుకు ఆర్టీసీ యజమాన్యం ప్రత్యేక బస్సులను షెడ్యూల్ను సిద్ధం చేసింది. అలాగే సంస్థకు ఆదాయాన్ని పెంచడంతో పాటు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పటి నుంచి ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగింది.
హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం రీజియన్ అధికారులు స్పెషల్ బస్సుల ప్రణాళిలను ఖరారు చేశారు. ఖమ్మం రీజియన్ పరిధిలో 11 రోజుల్లో 1,387 సర్వీసులు నడపాలని షెడ్యూల్ రూపొందించారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి లక్షలాది మంది ప్రయాణికులు ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు సరిహద్దు ప్రాంతాలకు తరలివస్తుంటారు. దీంతో బస్సుల్లో సీటు, రైళ్లలో బెర్తులు దొరక్కపోవటం, ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీల వల్ల ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఖమ్మం నగరం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, ఇల్లెందు వంటి పట్టణాలకు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
601 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం : సాధారణ బస్సులు రెగ్యులర్ ఛార్జీలే వసూలు చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండొచ్చు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఈ పండగ వేళలో ఛార్జీలు రెండింతలు చేస్తారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. ప్రయాణికులు రద్దీని దృష్టి పెట్టుకుని దాదాపు 601 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. దీని ద్వారా ప్రయాణికులకు సీటు గ్యారెంటీపై ఆర్టీసీ భరోసా కల్పించింది. రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ కోసం అధికారిక వెబ్సైట్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఖమ్మం నుంచి హైదరాబాద్కు : పండక్కి వెళ్తున్నారు? బాగానే ఉంది. మరి తిరుగు ప్రయాణం సంగతేంటి? అందుకు భయమే అవసరం లేదు. పండగ తర్వాత ప్రయాణానికి సైతం ప్రయాణికుల సౌలభ్యం కోసం జనవరి 16 నుంచి 20 వరకు 569 సర్వీసులను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ బస్సులు 236, సాధారణ బస్సులు 333 ఉన్నాయి. ఇందులో గరిష్ఠ రద్దీ రోజులుగా అంచనా వేస్తూ 11,12,13 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్కు ఒక్కోరోజు 156 బస్సుల చొప్పున నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో 18వ తేదీన అత్యధికంగా 173 బస్సుల అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్కు : జనవరి 9 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సుల అందుబాటులో ఉంటాయి. మొత్తం 818 సర్వీసులు నడపాలని అధికారులు షెడ్యూల్ ని రూపొందించారు. వీటిలో 365 సర్వీసులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. మిలిగిన 453 సాధారణ సర్వీసులను ఏర్పాటు చేశారు.
సంక్రాంతికి రైళ్లు సర్వీసులు ఇలా : ఈ సంక్రాంతి నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అదనపు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. ఖమ్మం రైల్వేస్టేషన్ మీదుగా 11 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారని రైల్వే చీఫీ కమిర్షియల్ ఇన్స్పెక్టర్ డి.రాజగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభమై ఈ నెల 25వ తేదీ వరకు నడుస్తాయన్నారు. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి టికెట్ రిజర్వేషన్లు ప్రారంభించారని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు రైల్వేస్టేషన్లో సంప్రదించాలని తెలిపారు.
సంక్రాంతి పండగకు 1,200 ప్రత్యేక బస్సులు - నగరం నలువైపుల నుంచి అందుబాటులో
డిమాండ్ పెరిగినా బస్సులు మాత్రం పెరగలేదు - ఉన్నవాటితోనే నెట్టుకొస్తున్న ఆర్టీసీ

