సభ పెట్టుకోవడం అనేది నా హక్కు - దాన్ని కాదనకూడదు : పవన్ కల్యాణ్
తెలంగాణ నేతల వ్యాఖ్యలపై స్పందించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ - రాష్ట్ర విభజనకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం - తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ భావం ఉందని వెల్లడి

Published : June 3, 2026 at 7:14 PM IST
|Updated : June 3, 2026 at 8:41 PM IST
Pawan Kalyan on Telangana Leaders Comments : తెలంగాణ భూమి పుత్రుల జాగీరేనని జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన సభ గురించి స్పందించారు.
సభకు అనుమతి ఇవ్వడం చిన్న విషయం : ఈ 12 ఏళ్లలో అనేకమంది ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణలో పని చేశారన్న పవన్ కల్యాణ్ఈ 12 ఏళ్లలో అనేకమంది తెలంగాణ కాంట్రాక్టర్లు ఏపీలో పని చేశారని తెలిపారు. తన సభకు అనుమతి ఇవ్వడం చిన్న విషయమని, ఇస్తే గొడవే వచ్చేది కాదని అన్నారు. హైదరాబాద్లో తనకు ఇల్లు ఉందని, అక్కడ ఉండటం సాధారణమని పేర్కొన్నారు. సభ పెట్టుకోవడం అనేది తన హక్కు అని దాన్ని కాదనకూడదని తెలిపారు.
రాహుల్ గాంధీకి మంచిది కాదు : రాష్ట్ర విభజనకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదని మరోసారి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంచిది కాదని, కాంగ్రెస్ అగ్రనేతలు దేశ సమగ్రత గురించి మాట్లాడాలని హితవు పలికారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఏం నేర్చుకున్నారని ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారు ప్రజలకు ఏం సందేశం ఇస్తారని నిలదీశారు. తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ భావం ఉందని, ఏపీ ప్రజల్లో ఉన్న ఉప ప్రాంతీయవాదం సరికాదని వెల్లడించారు.
తెలంగాణ జాగీరే : తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తనకు సోదరుడితో సమానమన్న పవన్ కల్యాణ్ కేటీఆర్ ఏమన్నారో తాను వినలేదని తెలిపారు. తనకు తెలిసి కేటీఆర్ తప్పుగా మాట్లాడరని, తాము కలిసినప్పుడు ఈ అంశంపై సరదాగా మాట్లాడుకుంటామని అన్నారు. తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు.
"నా సభకు అనుమతి ఇవ్వడం చిన్న విషయం ఇస్తే గొడవే వచ్చేది కాదు. హైదరాబాద్లో నాకు ఇల్లు ఉంది. అక్కడ ఉండటం సాధారణం. సభ పెట్టుకోవడం అనేది నా హక్కు. దాన్ని కాదనకూడదు. రాష్ట్ర విభజనకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం రాహుల్గాంధీకి మంచిది కాదు. కాంగ్రెస్ అగ్రనేతలు దేశ సమగ్రత గురించి మాట్లాడాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఏం నేర్చుకున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు?. తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ భావం ఉంది. ఏపీ ప్రజల్లో ఉన్న ఉప ప్రాంతీయవాదం సరికాదు" - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి
తెలంగాణకు ఓ నినాదం, భావోద్వేగం ఉన్నాయి : పొట్టి శ్రీరాములు త్యాగం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసిందని గుర్తు చేశారు. మహానాయకులను కులచట్రాల్లో బిగించడం రాజకీయాల్లో అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు బలిదానం కారణంగా ఆంధ్రప్రదేశ్కు ఉనికి ఏర్పడిందని, తెలంగాణకు ఓ నినాదం, భావోద్వేగం ఉన్నాయని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్ర అన్న భావోద్వేగం లేదని తెలిపారు. 1998 నుంచి 2004 వరకూ రాజకీయాల్లో కులదూషణలు ఎక్కువయ్యాయని, ఏపీలో వైఎస్సార్సీపీ వచ్చాక కులదూషణలు మరీ ఎక్కువయ్యాయని అసహనం వ్యక్తం చేశారు.
జనసేన తరఫున సేనాగళం ఏర్పాటు : జనసేన మూలసిద్ధాంతాల్లో కులాల ఐక్యత ఒకటి అని గుర్తు చేశారు. కులదూషణ వైఖరి ఇలాగే పెరిగితే పరిపాలన కూడా కష్టమవుతుందని అన్నారు. అధికారం కోల్పోయాక వైఎస్సాప్సీపీ మరీ బరితెగించిందని, కులదూషణ వైఖరికి చరమగీతం పాడాలని జనసేన నిర్ణయించిందని స్పష్టం చేశారు. కొందరు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారని, జనసేన తరఫున సేనాగళం ఏర్పాటు చేశామని వెల్లడించారు.
తెలంగాణలో పవన్ కల్యాణ్ కార్యక్రమం అడ్డుకోవడం సరికాదు: చంద్రబాబు

