కైలాసగిరిపై రెస్టారెంట్లకు అనుమతి - పర్యావరణవేత్తల ఆందోళన
వివాదాస్పదంగా కైలాసగిరిలో రెస్టారెంట్లకు అనుమతుల వ్యవహారం - సీఆర్జెడ్ నిబంధనలను అతిక్రమిస్తున్నారంటున్న పర్యావరణవేత్తలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 15, 2025 at 3:04 PM IST
Controversy At Kailasagiri in Visakhapatnam: కూటమి ప్రభుత్వం టూరిజం రంగానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలో పెద్దఎత్తున పర్యాటక ప్రాజెక్టులు చేపడుతోంది. పర్యాటక వనరులైన సముద్ర తీరాలు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలు, నదీ తీరాలు, ప్రసిద్ధిగాంచిన ఆలయాల దగ్గర నుంచీ పురాతమైన కట్టడాల వరకు సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి వింతలున్న ప్రాంతాలతో పాటు వేర్వేరు చోట్ల విభిన్నమైన వాటికి మరింత గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ నేపథ్యంలోనే విశాఖ పర్యాటకంలో కైలాసగిరి కీలకపాత్ర పోషించేందుకు పొడవైన గాజు వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాతకంగా చేపట్టింది. పర్యాకులకు సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కైలాసగిరిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గాజు వంతెన డిసెంబరు 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు కైలాసగిరిపై భారం పడుతోంది. ఇప్పటికే 55కిపైగా దుకాణాలతో కిక్కిరిసిపోయింది. టాయ్ ట్రైన్, స్కై సైక్లింగ్, జిప్ లైనర్, గాజు వంతెనలు ఉన్నాయి. మరో వైపు సింగపూర్ సంస్థతో ప్రత్యేక ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు.
పర్యావరణవేత్తల ఆందోళన: అక్కడితో ఆగకుండా కాటేజీలు, భారీ రెస్టారెంట్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఇలాంటి కట్టడాలను చేపట్టకూడదని గతంలో హైకోర్టు ఆదేశాలున్నాయి. దాంతో తీర ప్రాంత క్రమబద్ధీకరణ (సీఆర్జెడ్) నిబంధనలను అతిక్రమిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతిపాదన: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీఎంఆర్డీఏ కైలాసగిరిపై ఎకో హైట్స్ కాటేజీలు, 360 డిగ్రీల రివాల్వింగ్ ఫైన్ డైన్ రెస్టారెంట్, బే వ్యూ కేఫ్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీన్ని ఓ వైఎస్సార్సీపీ నేతకు 33 ఏళ్ల లీజుకు కట్టబెట్టాలని చూశారు. కానీ ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. అప్పట్లో పిలిచిన టెండర్లను ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు అదే ప్రాజెక్టును మళ్లీ పట్టాలపైకి తీసుకురావాలని నిర్ణయించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
నిర్మాణాలు ఇలా!: నేచర్ కాటేజీలు 20 గదులను నిర్మిస్తారు. దీనికితోడు ఈత కొలను, సమావేశ మందిరం, పార్టీ హాలు, భోజనశాల సైతం ఉంటాయి. ఒకేసారి వంద మంది కూర్చొని తినేలా రివాల్వింగ్ రెస్టారెంట్ను నిర్మిస్తారు. అంతేకాకుండా 60 మంది కూర్చునేలా బీచ్ వ్యూకేఫ్ను సైతం నిర్మిస్తారు.
మొదటి నుంచి వివాదాస్పదమైన అంశం: కైలాసగిరిపై భారీ ప్రాజెక్టులు చేపట్టడం సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధమని అందుకే గతంలో హైకోర్టు కూడా తన తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి గతంలో ఇక్కడ నేచర్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్ నిర్మాణాలను చేపట్టగా పర్యావరణవేత్తలు న్యాయస్థానంలో పోరాటం చేశారు. దాంతో వెంటనే నిర్మాణాలను ఆపేయాలని న్యాయస్థానం తక్షణం ఆదేశాలిచ్చింది.
అభివృద్ధి పేరుతో విధ్వంసం: దీంతో ఆయా నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. అయినా సరే కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లడం గమనార్హం. గత ప్రభుత్వంలో అభివృద్ధి పనుల పేరుతోన కైలాసగిరి కొండపై విధ్వంసానికి పాల్పడ్డారు. ఫలితంగా వందలాది వృక్షాలను తొలగించారు. ప్రాజెక్టు విస్తీర్ణం 1.99 ఎకరాలుగా ఉంది. అంచనా విలువ రూ.20 కోట్లు వరకూ ఉంది. నిర్మాణానికి సంబంధించిన గడువు 18 నెలలుగా అధికారులు నిర్దేశించారు. ఇదిలావుంటే కైలాసగిరిపై భారీ ప్రాజెక్టులు, రెస్టారెంట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే పొడవైన గాజు వంతెన - విశాఖలో డిసెంబర్ 1న ప్రారంభం
విశాఖ కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు

