ఓనమాల నాటి నుంచి అక్షరాలతోనే సహవాసం - 50 ఏళ్లలో ఏకంగా 18 పట్టాలు
50 ఏళ్లుగా అక్షరాలతో సహవాసం చేస్తున్న ఇమ్మడి నాగేశ్ - జాతీయ, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల నుంచి వివిధ పీజీలు చేసి పట్టా సాధించిన వ్యక్తి

Published : January 9, 2026 at 12:06 PM IST
57 years Man Earned 18 Degrees : చదవాలనే కృష్టి, పట్టుదల ఉంటే వయసుతో ఏమాత్రం సంబంధం ఉండదు. చదవాలంటే ఎన్ని కోర్సులు లేవు చెప్పండి. ఇప్పుడున్న యువత ఉన్న డిగ్రీనే పూర్తి చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడ 57 ఏళ్ల వయసులో కూడా ఇంకా చదువుతూనే తన డిగ్రీలు చేస్తూ పట్టాలు సాధిస్తున్నారు ఇమ్మడి నాగేశ్. ఈయన ఏళ్లు తరబడి వివిధ యూనివర్సిటీల్లో డిగ్రీలు చదువుతున్నారు. ఈయనకు చదువుపై ఎంత మక్కువ ఉందో ఈ 18 పట్టాలతో రుజువు చేశారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్లుగా అక్షరాలతోనే సహవాసం చేస్తున్నారు. నల్గొండ జిల్లా నారాయణపురానికి చెందిన ఇమ్మడి నాగేశ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
50 ఏళ్లలో 18 పట్టాలు : 57 ఏళ్ల ఇమ్మడి నాగేశ్ ఇప్పటికి 18 పట్టాలు సాధించాడు. సొంత గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత హైదరాబాద్ మలక్పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలో బీకాం, జాతీయ, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల నుంచి వివిధ కోర్సుల్లో పీజీ పూర్తి చేసి పట్టాలు అందుకున్నారు. ఆయన చదువుకు సంబంధించిన ఉద్యోగాలే చేశారు. మూడేళ్లుగా సొంత ఊళ్లోనే రామకృష్ణ మఠం సహకారంతో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం శిక్షణ, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
కోర్సుల్లో హిందీ భాషపై ఎక్కువ పట్టాలు : హిందీ భాషపై ఇష్టంతో 'హిందీ విద్వాన్' పట్టా అందుకున్నారు. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ హిందీ డైరెక్టరేట్ నుంచి డిప్లొమా ఇన్ హిందీ పట్టా పొందారు. ఆ తర్వాత దిల్లీలో ఉన్న రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి ప్రవేశ్ సంస్కృతంలో ప్రవేశ్ పట్టా సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో సీనియర్ డిప్లొమా, ఎంఏ (సంస్కృతం), ఎంఏ (హిందీ), ఎంఏ (ఇంగ్లీష్) పట్టాలు సాధించారు. అలాగే ఇఫ్లూలో పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ స్టడీస్ కోర్సు పూర్తి చేశారు. హిందీ పండిట్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ సంస్థలో శిక్షణ పూర్తి చేశాడు. అంతేకాదు నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్లో ఆయనకు సభ్యత్వం కూడా ఉంది.
వృత్తి విద్యలో శిక్షణ : మల్లేపల్లిలోని ఐటీఐలో హ్యాండ్ కంపోజింగ్ అండ్ ఫ్రూఫ్ రీడింగ్ వృత్తి విద్యను పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ శ్రామిక్ విద్యా పీఠ్ నుంచి స్క్రీన్ ప్రింటింగ్లో డిప్లొమా కోర్సు, అలాగే ‘సెట్విన్’ సంస్థలో చేరి ‘ఆర్ అండ్ ఏసీ’లో శిక్షణ కోర్సు పూర్తి చేశారు.
వైద్యంపై మక్కువతో ఎన్నో పట్టాలు : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఔషదీ వృక్షశాస్త్రంలో పీజీ డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత పట్టా సాధించారు. కరోనా సమయంలో కూడా ఖాళీగా లేరు. నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి హోమియో డిస్పెన్సరీలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశారు. ఇటీవల తన 57 ఏళ్ల వయసులో కేయూ నుంచి డిప్లొమా ఇన్ యోగా కోర్సు పూర్తి చేసి పట్టా సాధించారు.
అక్షరాలే ఉద్యోగాలు : బండ్లగూడ జాగీర్, హిందూపూర్లలోని ప్రైవేటు పాఠశాలలో యోగా శిక్షకుడిగా, ఇబ్రహీంపట్నం జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్గా, హిందీ పండితుడిగా, చౌటుప్పల్లోని ప్రైవేటు కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా అలాగే వివిధ న్యూస్ పేపర్లలో ప్రకటనల విభాగంలో అనువాదకుడిగా ఉద్యోగాలు చేశారు.
13 ఏళ్ల వరకు పశువుల కాపరి - ఇప్పుడు జియాలజీలో పీహెచ్డీ పట్టా
డాక్టరేట్ పట్టా అందుకున్నాడు - కానీ ఆ ఒక్క వ్యసనంతో జీవితం తలకిందులైంది

