డిగ్రీతో కొలువుల పంట - కాస్త శ్రద్ధగా చదివితే భవిష్యత్తు బంగారు మయం!
డిగ్రీ అర్హతతోనే దేశంలో ఎన్నో ఉన్నత ఉద్యోగాలు - రాష్ట్రంలో గ్రూప్స్ ఉద్యోగాలే నిదర్శనం - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు మంచి రంగాల్లో అవకాశాలు

Published : November 8, 2025 at 3:19 PM IST
Job Opportunities After Graduate Degree : దేశంలో అత్యున్నత స్థాయి ఉద్యోగం ఏది సాధించాలన్నా దానికి గ్రాడ్యుయేషన్ అవసరం. గ్రాడ్యుయేషన్ అంటే అటు మూడేళ్ల డిగ్రీ అయినా, ఇటు నాలుగేళ్ల టెక్నికల్ డిగ్రీ(బీటెక్) అయినా ఫర్వాలేదు. కేవలం డిగ్రీ అర్హతతోనే కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో కొలువు సాధిస్తే రూ.లక్షల్లో జీతంతో పాటు మంచి సదుపాయాలను పొందవచ్చు. అయితే ఇందుకు ఇంటర్ లేదా డిప్లొమా నుంచే డిగ్రీ కోసం తగిన సాధన చేయవచ్చు.
డిగ్రీతోనే ఉన్నత ఉద్యోగాలు : డిగ్రీలో జాయిన్ అయిన మొదటి లేదా రెండో ఏడాదిలోనే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నారు. దీంతో వారు మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఈ విద్యార్హతతో ఉద్యోగంలో ప్రమోషన్లు సాధించి, పై స్థాయి ఉద్యోగాలను సాధించవచ్చు. కానీ ఈ డిగ్రీ చదువుతున్న దశలోనే కాస్త శ్రద్ధ పెడితే ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవలి కాలంలో గ్రూప్స్ ఉద్యోగాలు సాధించిన వారే.
గత నెల వరకు మూడేళ్ల డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాలు అనేవి కొనసాగిన విషయం తెలిసిందే. అందుకే ప్రాథమిక తరగతుల్లో డిగ్రీ విద్య ప్రాధాన్యం-భవిష్యత్తు అవకాశాలపై విస్తృతంగా అవగాహన అనేది కల్పిస్తున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైతే సివిల్స్, గ్రూప్స్నకు చక్కటి రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకోవచ్చు. కేవలం డిగ్రీ అర్హతతోనే యూపీఎస్సీ, యూనిఫాం సర్వీసులు, పోస్టల్, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, బోధన రంగాల్లో విశేష అవకాశాలు ఉన్నాయి.
కళాశాల స్థాయిలో తర్ఫీదు : సిద్దిపేట ఆటనామస్ కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఏడాదిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వందలాది మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరి కొంత మంది వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. కళాశాల స్థాయిలో తర్ఫీదు అందిస్తున్నారు. అలాగే ఇంటర్న్షిప్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రాజెక్టులు, కార్యశాల, క్షేత్రస్థాయి పర్యటనలు, సదస్సులు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారు. కంపెనీలతో ఎంవోయూలు చేసుకుంటున్నారు. సర్టిఫికేట్ కోర్సులతో నైపుణ్యాలు పెరుగుతున్నాయి. ఏడాదిలో ఉద్యోగాలు సాధించిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 400 మంది ఉన్నారు.
''సిద్దిపేట మహిళా డిగ్రీ కళాశాలలో హెచ్ఈపీ కోర్సు 2022లో పూర్తయింది. గ్రూప్స్ ఉద్యోగ సాధన లక్ష్యంగా డిగ్రీలో చేరాను. చదువుతూనే పరీక్షలకు సన్నద్ధమయ్యాను. 2023లో గ్రూప్-4 రాసి ఎంపికై సిద్దిపేట మున్సిపల్ వార్డు అధికారిణిగా పది నెలలుగా కొనసాగుతున్నా. ఈ పరీక్షలకు డిగ్రీ పాఠ్యాంశాలు ఉద్యోగ సాధనకు ఉపయోగపడ్డాయి.'' - దాసరి రసజ్ఞ, నంగునూరు
సాధనకు ఉపయోగపడే అంశాలు ఇవే :
- సబ్జెక్టులకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి.
- గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- హాజరుశాతం 80 శాతం పైగా ఉంటే అవకాశాలు మెండు.
- సోషల్ మీడియాలో మితిమీరి సమయం గడపవద్దు.
- టీఎస్కేసీ, టాస్క్ అందించే శిక్షణలు వినియోగించుకోవాలి.
''సిద్దిపేట అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ (ఎంపీపీఎస్) 2024లో పూర్తయింది. ఎన్సీసీ-సీ సర్టిఫికేట్ ఉపయోగపడింది. మొదట్లో నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగానికి ఎంపికవగా రిపోర్టు చేశాను. ఆ వెంటనే సెంట్రల్ ఆర్ముడ్ పోలీసు ఫోర్సెస్లో ఎస్ఎస్సీ ద్వారా ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసుగా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం తమిళనాడులో శిక్షణ పొందుతున్నా. నెల తర్వాత జమ్మూ కశ్మీరులో విధుల్లో చేరుతా.''- కె.స్వామి, కొడకండ్ల
YUVA : మూడేళ్లలో రోజుకు 14 గంటల కఠోర శ్రమ - గ్రూప్-1లో ఎంపీడీవోగా కొలువు

