రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చాం : హోంమంత్రి అనిత
వైఎస్సార్సీపీ నేతల వెంట పిల్లల్ని పంపించే విషయంలో అప్రమత్తం కావాలన్న హోంమంత్రి - డ్రగ్స్, గంజాయి వ్యాప్తిచేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తత అవసరమని సూచన

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 6, 2025 at 3:56 PM IST
Home Minister Anitha on YS Jagan: వైఎస్సార్సీపీ నేతల వెంట తమ పిల్లల్ని పంపించే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని వ్యాప్తి చేయాలని చూస్తున్న వైఎస్సార్సీపీ వెంట విద్యార్థులు, యువత తిరగకుండా చూసుకోవాలని సూచించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రభుత్వం అంటుంటే జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఇంకా డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. విద్యార్థులు, యువత జీవితాల్ని నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు.
తన ధన దాహంతో విద్యార్థుల భవిష్యత్ను తుంచేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో వైఎస్సార్సీపీ నేత కొండారెడ్డి అడ్డంగా దొరికితే, జగన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సిగ్గుపడాలని విమర్శించారు. కొండారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా విద్యార్థి విభాగానికి జగన్ సమావేశాలు పెడుతుండటాన్ని ఎలా చూడాలని నిలదీశారు.
ఏ ముఖం పెట్టుకుని విద్యార్థి విభాగాలకు జగన్ శిక్షణా కార్యక్రమాలు పెడుతున్నారని అనిత ప్రశ్నించారు. గంజాయి, డ్రగ్స్కు తన పూర్తి మద్దతు ఉందని పులివెందుల ఎమ్మెల్యే చెప్తున్నారా ? అని నిలదీశారు. గంజాయి, డ్రగ్స్ అంటూ విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసేందుకు పులివెందుల జగన్ కుట్రల్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తేల్చిచెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని ప్రభుత్వం పాఠశాల స్థాయికి తీసుకెళ్లి చైతన్యం తీసుకొస్తోందని వెల్లడించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చూసేందుకు లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని అనిత తెలిపారు. డ్రగ్స్కు కేంద్రంగా చేసేందుకే జగన్ విశాఖను రాజధాని చేస్తా అన్నారా? అని ఆక్షేపించారు. ఆడబిడ్డల్ని కించపరిచే విధంగా సాక్షి మీడియాలో ప్రచారం చేసే కథనాలు దుర్మార్గమని మండిపడ్డారు. ఆడబిడ్డలపై తప్పుడు రాతలు రాసే వారిపై కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి హెచ్చరించారు.
ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో గంజాయిగా లేకుండా చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదాన్ని పాఠశాల స్థాయి వరకూ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. గతంలో గంజాయికి బానిసగా మారిన పిల్లలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారని గుర్తుచేశారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు అనిత పేర్కొన్నారు.
డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు, కేసుల్లో ఇరుక్కుంటే వచ్చే నష్టాలేంటో అవగాహన కల్పిస్తున్నామని అనిత తెలిపారు. యువత భవిష్యత్తుపై మాట్లాడే హక్కు జగన్కు లేదన్న అనిత, డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు ఆయన ఒత్తాసు పలుకుతున్నారా? అని ప్రశ్నించారు. 2019 నుంచి 24 మధ్య దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పుకొనే పరిస్థితి ఉండేదని అన్నారు.
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్ది అని దుయ్యబట్టారు. స్కూల్ పిల్లల బ్యాగ్ల్లోకి కూడా దాన్ని చేర్చిన ఘనత ఆయనదని, డ్రగ్స్, గంజాయిపై వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క సమీక్ష అయినా చేశారా? అని నిలదీశారు. కానీ సీఎం చంద్రబాబు దీని నిర్మూలనకు ఆరుగురు మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారని అనిత గుర్తు చేశారు.
"ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూలు స్థాయిలోకి తీసుకెళ్తున్నాం. డ్రగ్స్, గంజాయి వ్యాప్తిచేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తత అవసరం. జగన్ నేతృత్వంలో వైసీపీ ఇంకా డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, యువత జీవితాలను నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారు. కొండారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా విద్యార్థులతో జగన్ సమావేశాలా?. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చూసేందుకు లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డ్రగ్స్ను కేంద్రంగా చేసేందుకే జగన్ విశాఖను రాజధాని చేస్తా అన్నారా?". - అనిత, హోంమంత్రి
అప్పుడప్పుడు ఏపీకి వచ్చే జగన్ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు: లోకేశ్
వైఎస్సార్సీపీ బలం తగ్గింది - ఇక జగన్కు చెక్ పెడతాం: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

