రోడ్లపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే వదిలేది లేదు - నేరగాళ్లు, రౌడీషీటర్లపై ఉక్కుపాదం: హోం మంత్రి అనిత
రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారన్న హోంమంత్రి - రాజకీయాలను అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని వెల్లడి - ఇలాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 6:17 PM IST
Home Minister Anitha Fires On YSRCP Leaders Anarchy in AP : రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. జంతు బలులు చేసి ఉన్మాదుల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. జంతుబలులతో రక్తాభిషేకం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఆ పార్టీ నేతలు ముగుజీవాల్ని బలి ఇచ్చి చేసిన రక్తాభిషేకంపై మండిపడ్డారు.
రోడ్లపైకి వచ్చి కత్తులు పట్టుకుని తిరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. రక్తాభిషేకం చేసిన వాళ్లంతా కటకటాల్లో ఉన్నారని చెప్పారు. చిన్న పిల్లలను కూడా సైకోలు, ఉన్మాదుల్లా తయారు చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. టీనేజ్ పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఏం చేసినా ఆ పార్టీ నాయకుడు నోరు తెరిచి తప్పని చెప్పడం లేదన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఇక్కడ ఉంది సీఎం సీబీఎన్ : రాజకీయ ముసుగులో యువత భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటున్న జగన్ అసలు మనిషేనా అని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇక్కడ ఉంది సీఎం సీబీఎన్ అని జగన్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. జంతు బలిలో పాల్గొన్నవారు, కత్తులు పట్టి రోడ్డు ఎక్కినవారంతా ఈరోజు రిమాండ్లో ఉన్నారని హోంమంత్రి తెలిపారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామంటే అరికట్టేందుకు పోలీస్ శాఖ సైతం తేల్చుకునేందుకు సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు.
ఆడపిల్లల జోలికి వస్తే అంతే : గతంలో మాదిరి నిందితులకు ముసుగు వేయకుండా వారిని అందరి ముందు బహిర్గతం చేస్తామని మంత్రి అనిత వెల్లడించారు. ఆడపిల్లల జోలికి వస్తే రోడ్డుపై నడిపించి స్టేషన్కు తీసుకెళ్తామని హెచ్చరించారు. శృతి మించి ప్రవర్తిస్తే రాష్ట్ర బహిష్కరణకు వెనుకాడమని వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్ సినిమా చూసినట్లుగా వైఎస్సార్సీపీ వికృత చేష్టలు ఉన్నాయని, నేతల్ని ఉన్మాదుల్లా ఆపార్టీ నాయకుడు ఎలా తయారు చేస్తున్నాడో ప్రజలు గమనించాలని సూచించారు.
జగన్ ఆదేశాలతోనే ఈ తరహా కార్యక్రమాలు జరిగాయా? అని మంత్రి అనిత ప్రశ్నించారు. గర్భిణీ స్త్రీని కాలుతో తన్నే ఉన్మాదుల్ని ఏమనాలని మండిపడ్డారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం అడ్డంపెట్టుకునే చేసే కుట్రలు స్పష్టమవుతున్నాయని తెలిపారు. అధికారంలో ఉండగా గంజాయ్ని ప్రోత్సహించిన జగన్ యువత భవిష్యత్తుని నాశనం చేశారని అనిత ఆక్షేపించారు. తాజా వికృత చేష్టలతో 18ఏళ్ల లోపు యువత జీవితాల్ని నాశనం చేయటమే జగన్ పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
" బహిరంగ ప్రదేశాల్లో జంతుబలి చేయడం నేరం. వైఎస్సార్సీపీ నేతలు అనేకచోట్ల జంతుబలులు చేసి ఉన్మాదం చాటుకున్నారు. తమ పార్టీ నేతలు ఏం చేసినా ఆ పార్టీ నాయకుడు నోరు తెరిచి తప్పని చెప్పలేదు. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం ఉన్మాదం కాదా?. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మీ పరిస్థితి ఇదేనంటూ నినాదాలు ఇవ్వడం దారుణం. రాజకీయాలను అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారు. చిన్న పిల్లలను కూడా సైకోలు, ఉన్మాదుల్లా తయారుచేస్తున్నారు. టీనేజ్ పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు.
రాజకీయ నేతల ఉద్దేశాలు కూడా పిల్లల తల్లిదండ్రులు ఆలోచించాలి. ఆస్తి గురించి సొంత తల్లి, చెల్లెలిపై కేసులు పెట్టినవారు మీ పిల్లల్ని రక్షిస్తారా?. పిల్లలు రోడ్డుపైకి వచ్చి నరుకుతాం, చంపుతాం అంటున్నారు. తమ పార్టీ నేతలు చేసింది తప్పని చెప్పలేరా జగన్. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అనేక దారుణాలు జరిగాయి. అధికారం కోల్పోయినా మరో రకం దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని ఖండించలేదంటే జగన్ అసలు మనిషేనా?. నేరాలు ప్రోత్సహించే పరిస్థితి నీది, వాటిని అరికట్టే బాధ్యత మాది. రోడ్లపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే ఎవరినీ వదిలేది లేదు. ఫ్లెక్సీలపై రక్తం చల్లినవారందరినీ అరెస్టు చేశాం. నేరగాళ్లు, రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతాం." - హోంమంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా సైకో చర్యలు : తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తుపై ఆలోచన చేయాలని మంత్రి సూచించారు. 18 ఏళ్ల లోపు పిల్లలు కత్తులు పట్టుకుని రోడ్డెక్కుతుంటే తప్పు అని చెప్పేందుకు కూడా మనసు రాలేదా? అని నిలదీశారు. జగన్ పుట్టినరోజు నాడు వైఎస్సార్సీపీ వికృత చేష్టలు మానవత్వం ఎటు పోతోందో అనే రీతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో వైఎస్సార్సీపీ సైకోలు చేపట్టే చర్యలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా ఉందని మండిపడ్డారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్సీపీ వికృత చేష్టలు, జంతు బలులపై హోంమంత్రి అనిత వీడియో విడుదల చేశారు.
రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చాం : హోంమంత్రి అనిత
పవన్ కల్యాణ్ ఆదేశిస్తే తప్పేంటి? - డీఎస్పీ వివాదంపై హోంమంత్రి అనిత స్పందన

