సంక్షేమ హాస్టళ్లలో బాలల మృతి ఆందోళనకరం - వైద్యారోగ్య శాఖకు హైకోర్టు ఆదేశాలు
తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు - వైద్యశిబిరాల ఏర్పాటు, పరిహారం చెల్లింపుపై వివరాలివ్వండి- వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 1, 2026 at 1:50 PM IST
High Court About Welfare Hostels Children Deaths : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పరిధిలోని వసతి గృహాల్లోని బాలబాలికలు అనారోగ్యానికి గురవటంపై దాఖలైన పిటీషన్పై హైకోర్టు విచారణ జరిపింది. 2016 నుంచి నేటి వరకు 45 మరణాలు సంభవించడం ఆందోళనకు గురిచేస్తోందని వ్యాఖ్యానించింది. నెలకు హెల్త్ క్యాంపులు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు, వైద్యపరీక్షలు ఎన్ని సార్లు చేస్తున్నారో పూర్తి వివరాలు అందించాలని న్యాయస్థానం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. గిరిజన సంక్షేమ హాస్టల్స్లో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని, నిరంతర పర్యవేక్షణ కోసం ఏఎన్ఎం ,హెల్త్ వాలంటీర్లను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పి.రంజిత్కుమార్ హైకోర్టులో పిల్ వేశారు.
2016 నుంచి నేటి వరకు 45 మరణాలు : గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఉంటున్న బాలబాలికల అనారోగ్య కారణాలతో కన్నుమూయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. 2016 నుంచి నేటి వరకు 45 మరణాలు సంభవించడం ఆందోళనకు గురిచేస్తోందని వ్యాఖ్యానించింది. జ్వరం, కడుపునొప్పి, బ్లడ్ ఇన్ఫెక్షన్, కాలేయ సంబంధిత వ్యాధులతో పిల్లలు మృతి చెందారంటే వైద్యం అదించడంలో అధికారులు దారుణంగా విఫలమైనట్లేనని వ్యాఖ్యానించింది. వసతి గృహాల్లో ఉంటున్న బాలబాలికలను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో బాలబాలికల మరణాలు, అందుకు కారణాలు, తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జనవరి 21కి వాయిదా : మృతులు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో అనుసరిస్తున్న విధానమేమిటి, ఇప్పటి వరకు ఎందరికి పరిహారం చెల్లించారు వివరాలతో నివేది ఇవ్వాలని స్పష్టం చేసింది. నెలకు ఎన్నిసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారో వివరాలతో పాటు హెల్త్ క్యాంపుల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను కోర్టు ముందుంచాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ను ఆదేశించింది. విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
మృతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పరిధిలోని వసతి గృహాల్లోని బాలబాలికలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని, నిరంతర పర్యవేక్షణ కోసం ఏఎన్ఎం(ఆగ్జలరీ నర్స్ మిడ్వైవ్స్), హెల్త్ వాలంటీర్లను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పి.రంజిత్కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీకాంత్ వాదనలు వినిపించారు. 2016 నుంచి ఇప్పటి వరకు గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో 45 మరణాలు చోటు చేసుకున్నాయన్నారు.
15 రోజులకోసారి పర్యవేక్షణ : అనారోగ్యానికి గురైన పిల్లలకు సహాకారం అందించేందుకు ప్రతి వసతి గృహంలో ఏఎన్ఎం, హెల్త్ వాలంటీర్ను నియమించేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు. 2025లో రెండు మరణాలు సంభవించాయన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మంది పిల్లలు మృతి చెందినట్లు పిటిషనర్ చెబుతున్నారని అందుకు కారాణాలేమిటనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. సమీప గ్రామాల్లోని ఏఎన్ఎంలు 15 రోజులకోసారి హాస్టళ్లకెళ్లి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తుంటారన్నారు.
నంద్యాల జిల్లాలో దారుణం- ముగ్గురు పిల్లల్ని చంపి ఆపై తండ్రి ఆత్మహత్య
ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వారిని హోంలకు తరలించండి: హైకోర్టు

