అల్పపీడనం ఎఫెక్ట్ - ఆ జిల్లాల్లో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా-బంగాల్ తీరంలో అల్పపీడనం - రాబోయే 2-3 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం - రానున్న 3 రోజులు ఉత్తరాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 2, 2026 at 8:41 PM IST
Rain Alert in AP : వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా-బంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 2-3 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తరాంధ్రలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వివరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రేపు (శుక్రవారం) శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

