విద్యార్థుల మార్కులు, హాజరు వివరాలన్నీ ఒకే చోట - సరికొత్త విధానానికి అధికారుల శ్రీకారం
1-10వ తరగతి విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు - కొత్త విధానం ప్రవేశపెట్టిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం - ఒక్క క్లిక్తోనే క్షణాల్లో విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు అవకాశం

Published : September 3, 2026 at 1:43 PM IST
School Students Digitalization in Hyderabad : ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో 1-10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో ఉండేందుకు వీలుగా హైదరాబాద్ జిల్లా యంత్రాంగం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి విద్యార్థి ఆధార్, అపార్ కార్డుల వివరాలను పాఠశాల రికార్డుల్లో ఉండేలా నమోదు చేయిస్తోంది. ఆధార్ ద్వారా గుర్తింపు, అపార్ కార్డుతో విద్యార్థి వ్యక్తిగత వివరాలు, మార్కులు, ప్రతిభా పురస్కారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ అధికారులు ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు. ఈ వివరాలతో వారికి మరిన్ని సంక్షేమ పథకాలు, కొత్త పాఠశాలలు ప్రారంభించేందుకు అవకాశం కలగనుంది.
ముచ్చటగా మూడు పద్ధతుల్లో : విద్యార్థుల వివరాలను కచ్చితంగా తెలుసుకునేందుకు 3 పద్ధతులు ఉన్నాయి. అటెండెన్స్ రిజిస్టర్లో వివరాలు కంప్యూటరీకరించేందుకు తొలి విధానం ఉపకరించనుంది.
- ప్రతి విద్యార్థికి సంబంధించిన సమాచారం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (యూడైస్)లో ఉండాలి. ఇందులో విద్యార్థి, తల్లిదండ్రుల వివరాలు సక్రమంగా ఉండాలి. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే ముందు హాల్టికెట్ నమూనాను తల్లిదండ్రులు చూసుకుని తప్పులుంటే సరిచేసుకోవాల్సి ఉంటుంది.
- అపార్ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి ఇస్తున్న విభిన్నమైన గుర్తింపుకార్డు. ఈ కార్డును డిజిటలైజ్డ్ చేశాక ఒకటో తరగతి నుంచి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఇలా ఎక్కడ చదువుకున్నా ఈ కార్డు నంబర్ను అపార్ వెబ్సైట్లో ఎంటర్ చేస్తే చాలు. వివరాలన్నీ తెరపై ప్రత్యక్షమవుతాయి.
- ఆధార్ వివరాలను నమోదు చేసేప్పుడు బయోమెట్రిక్స్ను నవీకరించడం ద్వారా వారు డిగ్రీ, పీజీ తరగతులకు వెళ్లినప్పుడు ఆధార్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు సులువుగా ఉంటుంది.
ఇంటింటికీ వెళ్లి నమోదు : బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నమోదు ప్రక్రియను జూన్ 15వ తేదీ నుంచి చేపట్టింది. ప్రతి జిల్లాలోనూ మండలాల వారీగా విద్యాశాఖ అధికారులు వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి, వారిని సమీపంలోని బడుల్లో చేర్పించాలి. ఇందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు పర్యటించాలంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదేశించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకూ 10.29 లక్షల మంది విద్యార్థులుండగా ఇందులో 9.36 లక్షల మంది విద్యార్థుల ఆధార్ కార్డుల వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేశామని ఆమె తెలిపారు. అపార్ కార్డులకు సంబంధించి 59 శాతం మంది విద్యార్థుల వివరాలు వెబ్సైట్లో నమోదు చేసినట్లు చెప్పారు.

