మళ్లీ కళకళలాడుతున్న బీసీ స్టడీ సర్కిళ్లు - విద్యార్థుల హర్షం
వెనకబడిన తరగతుల విద్యార్థులకు భరోసాగా బీసీ సివిల్స్ స్టడీ సర్కిల్స్ - ఉచితంగా కోచింగ్, నాణ్యమైన స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 7:58 PM IST
Government Supports Poor Civil Service Candidates: బీసీ సివిల్స్ స్టడీ సర్కిల్స్ వెనకబడిన తరగతుల విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయి. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు సివిల్స్ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసింది. వీటి వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పోటీ పరీక్షలకు అన్నివిధాలా ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బీసీ స్టడీ సర్కిళ్లు నిర్లక్ష్యానికి గురి కాగా కూటమి ప్రభుత్వంలో మళ్లీ అభ్యర్థుల శిక్షణా తరగతులు కళకళలాడుతున్నాయి.
అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన: సివిల్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవడమంటే వ్యయప్రయాసలు భరించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ, పేద, వెనకబడిన తరగతుల విద్యార్థులు సివిల్స్ పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3వేల మంది ప్రవేశ పరీక్ష రాయగా 100 మంది శిక్షణా తరగతులకు అర్హత సాధించారు. ఇక్కడ ఉచితంగా కోచింగ్, నాణ్యమైన స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన, పరీక్షలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు అందిస్తున్నారు.
వారానికి రెండుసార్లు పరీక్షలు: తరగతులతోపాటు అదనపు స్టడీ అవర్స్ కొనసాగిస్తున్నారు. వారానికి రెండుసార్లు పరీక్ష పెట్టి అభ్యర్థుల్లోని శక్తిసామర్థ్యాలు, పోటీతత్వాన్ని తట్టి లేపుతున్నారు. ప్రభుత్వ శిక్షణ కేంద్రాలంటే సరైన వసతులు ఉండవనే అపోహలకు తావులేకుండా భోజన, వసతి సదుపాయాల్లో ఏమాత్రం లోటు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్షల రూపాయల విలువైన సివిల్స్ శిక్షణ తరగతులను ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఉచితంగా అందించడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సివిల్స్కి ప్రిపర్ అవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకి చాలా పోటీ ఉంటుంది.పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన సివిల్స్ కోచింగ్ అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాం. ప్రతీరోజు ఉదయం 6.30 నుంచి 1.30 వరకు క్లాసులు జరుగుతాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. క్లాస్లులకి సంబంధించి ఏ సందేహం ఉన్నా అదే రోజు నివృత్తి చేస్తారు.-తనూజా రాణి, జాయింట్ డైరెక్టర్, బీసీ సంక్షేమ శాఖ
అభ్యర్థులకు ఎటువంటి లోటు లేకుండా: గత ప్రభుత్వంలో బీసీ స్టడీ సర్కిళ్లు నిరాదరణకు గురికాగా కూటమి ప్రభుత్వంలో మళ్లీ శిక్షణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నారు. సివిల్స్ కోచింగ్ మాత్రం ప్రస్తుతం విజయవాడ గొల్లపూడిలోనే అందిస్తున్నారు. భవిష్యత్తులో విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ సివిల్స్ బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. సివిల్స్ కోచింగ్ పరీక్షలు ప్రీమియం కావడంతో శిక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని, అభ్యర్థులకు ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
సివిల్స్ శిక్షణకు చాలా ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ ఉచితంగా కోచింగ్, నాణ్యమైన స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు చాలా బాగున్నాయి. ప్రస్తుతం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులే ఎక్కవగా ఉన్నారు.వారానికి రెండుసార్లు పరీక్ష పెట్టి మాలోని శక్తిసామర్థ్యాలు, పోటీతత్వాన్ని తట్టి లేపుతున్నారు. -అభ్యర్థులు
నిందితుడితో పోలీసులు కుమ్మక్కు - డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆందోళన వద్దు - ఆ జిల్లాల్లో ఎవరికీ బర్డ్ ఫ్లూ సోకలేదు: ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్

