రైతుబజార్ల నుంచి కూరగాయలు డోర్ డెలివరీ - పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
విశాఖలోని ఎంవీపీ రైతుబజారు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక - రవాణా ఛార్జీలు లేకుండా రైతుబజారు ధరలకే కూరగాయలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 9, 2025 at 4:32 PM IST
Digi Rythu Bazar Service in AP: తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి ఇంట్లో నిత్యావసరాలు, మందుల వరకు ప్రతిదీ ఆన్లైన్లో అందుబాటులో లభిస్తున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో డిజిటల్ ప్లాట్ఫామ్ క్రేజీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క క్లిక్తో కొన్ని క్షణాల్లోనే వస్తువులను మన ఇంటి వద్దకు డెలివరీ చేస్తున్నారు. మనకు అవసరమైనవి దుకాణం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తున్నాయి. వీటికి సంబంధించి ఎన్నో యాప్లు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం సైతం ఓ వెబ్సైట్ను ప్రారంభించింది. దీని ద్వారా ఏకంగా రైతు బజారు నుంచి కూరగాయలు డోర్ డెలివరీ చేసుకోవచ్చు. అసలు ఏంటి యాప్? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
పైలట్ ప్రాజెక్టుగా: విశాఖలో నగరవాసుల సౌకర్యార్థం రైతు బజార్లలోని కూరగాయలను ఇక నుంచి డోర్ డెలివరీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగానూ నగరంలోని ఎంవీపీ రైతుబజారును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఏ విధమైన రవాణా ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేకుండా రైతుబజారులో లభించే ధరలకే వినియోగదారులకు కూరగాయలు అందించనున్నారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ మేషంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ డెలివరీ బాయ్స్ని నియమిస్తారు. తద్వారా వినియోగదారుల ఇళ్లకు వారి ద్వారా కూరగాయలు సరఫరా చేస్తారు.
ఈ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి: రైతుబజారు నుంచి నేరుగా కూరగాయలను వినియోగదారుల ఇంటి వద్దకే అందించేందుకు ప్రభుత్వం https://digirythubazaarap.com వెబ్సైట్ రూపొందించింది. ఆన్లైన్లో ఈ వెబ్సైట్ని క్లిక్ చేసి రైతుబజారు నుంచి నేరుగా తాజా కూరగాయలు, పండ్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు. దీనిని స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సేవలకు ఏ మాత్రం తీసుపోని విధంగా తయారు చేశారు. అదే విధంగా డిజిటల్ చెల్లింపులను సైతం ప్రోత్సహిస్తున్నారు.
కేవలం ఆ సమయాల్లోనే అందుబాటులో: రైతుబజార్లలోని రైతుల వద్ద నాణ్యమైన తాజా కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని నేరుగా వినియోగదారులకు సరఫరా చేస్తారు. అయితే ఇది అన్ని వేళల్లో అందుబాటులో ఉండదు. కేవలం రైతుబజారు పని చేసే సమయాల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు ఉన్నారు.
ట్రయల్ రన్లో భాగంగా ప్రస్తుతం డెలివరీ బాయ్స్ ఎంవీపీ రైతుబజారు నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని వినియోగదారుల ఇళ్లకు వెళ్లి కూరగాయలు సరఫరా చేస్తున్నారు. మరో 2 వారాల్లో పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ముగ్గురు డెలివరీబాయ్స్ సేవలు అందిస్తున్నారు. వారికి మేషంట్ కంపెనీ జీతం చెల్లిస్తుంది.
సరకు నాణ్యతలో జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రస్తుతం రైతుబజార్లకు వచ్చే కూరగాయల్లో నాణ్యత సరిగా ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లి, టమాట, నాసిరకంగా ఉంటున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డోర్ డెలివరీ విధానం ద్వారా నాణ్యమైన కూరగాయలు అందజేయకపోతే వినియోగదారులు తిప్పి పంపించే అవకాశం ఉంది. నాణ్యమైన సరకు ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ విధానానికి ఆరంభంలోనే ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - 4 రోజుల ముందుగానే రేషన్!
సంప్రదాయ పద్ధతిలో కూరగాయల పెంపకం - ఐదంచెల విధానంలో కొత్త తరహా సాగు

