రెవెన్యూ ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు - వీఆర్వో నుంచి తహసీల్దారు దాకా!
21 మందిపై క్రమశిక్షణా చర్యలు ఆదేశించిన రెవెన్యూశాఖ - ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 1:59 PM IST
Government Action Against Tahsildar And Revenue Employees: ఒకే మండలంలో పనిచేసిన తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఇద్దరు ఆర్ఐలు, 14 మంది వీఆర్వోలు, సర్వేయరు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల మొత్తం 21 మందిపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
2020 సెప్టెంబరు 2వ తేదీన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విశాఖపట్నం జిల్లా (ప్రస్తుత అనకాపల్లి జిల్లా) కశింకోట మండలంలో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు అక్కడ పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో అక్కడ పనిచేస్తున్న తహసీల్దారు సుధాకర్ ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ప్రైవేటు వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్గా నియమించారు. అతనికి నెలవారీ జీతం చెల్లిస్తున్నట్లు కూడా వెల్లడైంది.
ఆధారాలతో కేసు నమోదు: డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐలు) హాజరు రిజిస్టర్ నిర్వహించడంలో, పాస్పుస్తకాల పంపిణీ చేయడంలో, మీసేవ దరఖాస్తులు నిర్వహించడంలో విఫలమైనట్లు తేలింది. బీరువా, చేతి సంచుల్లో నగదును కూడా గుర్తించారు. పట్టాదారు పాసుపుస్తకాలను పెట్టెలో పెట్టి, రిజిస్టర్లో నమోదు కూడా చేయలేదు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల్ని కనీసం డౌన్లోడ్ కూడా చేయకుండానే గడువు ముగిసే సమయంలో తిరస్కరించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్, పట్టాదారు పాసుపుస్తకాలకు కూడా నగదు వసూలు చేస్తున్నట్లు తేలింది. రికార్డులు సరిగా నిర్వహించడం లేదని గుర్తించడంతో ఆధారాలతో కేసు నమోదు చేశారు.
లంచం ఇవ్వకపోతే అంతే సంగతులు: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సరైన పరిశీలన లేకుండానే మ్యుటేషన్ దరఖాస్తుల్ని తిరస్కరించినట్లు వెల్లడైంది. ఫారం-8 సృష్టించాక కూడా 226 మ్యుటేషన్ దరఖాస్తులను తిరస్కరించారు. 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్ 1 వరకు ఉన్న దరఖాస్తులను పరిశీలించగా సబ్ డివిజన్ దరఖాస్తులు 21 వచ్చాయి. వాటిలో 13 అడంగల్ దిద్దుబాటుకు 668 దరఖాస్తులు రాగా 566, ఎఫ్లైన్ దరఖాస్తులు 1,137 వస్తే 200 తిరస్కరించారు. వీఆర్వో, ఇతర రెవెన్యూ అధికారులకు డబ్బు ఇవ్వకపోతే దరఖాస్తులు తిరస్కరించినట్లు విచారణలో వెల్లడైంది.
మరోవైపు ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆకస్మిక తనిఖీల్లో నాలుగు చోట్ల క్రిమినల్ కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేశారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి చెందిన 14 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నవంబరు 5, 6 తేదీల్లోను కూడా పలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. గత నెలలో సిబ్బంది నుంచి అధికారులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ గత నెలలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల దర్యాప్తు కొనసాగించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. గత కొద్దిరోజుల కిందట విశాఖలోని కొందరు ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు చేయగా భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు. సూపర్ బజార్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న బి.ఆనంద్కుమార్ ఇంట్లో సుమారు రూ.కోటి విలువైన ఆస్తులను అనిశా అధికారులు గుర్తించారు. అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులను నిర్వహిస్తున్న త్రిపురగిరి సుధారాణి ఇంట్లో దాదాపు రూ.కోటి విలువైన స్థిర, చరాస్తుల పత్రాలను కనుగొన్నారు. సబ్రిజిస్ట్రార్ మోహనరావు ఇంట్లోనూ స్థిరాస్తులు, మోటారు వాహనాలకు సంబంధించి పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ రోజంతా జరిపిన తనిఖీల్లో కొంత నగదు, బంగారు ఆభరణాలు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ మెరుపు దాడులు - పెద్ద ఎత్తున ఆస్తిపత్రాలు, నగదు స్వాధీనం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ దాడులు - అటెండర్ ఇంట్లో రూ.కోటి ఆస్తులు!

