పంచాయతీల్లో రూ.20 కోట్లు ఆవిరి! - నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అధికారులు
పెట్రోల్, డీజిల్ ఖర్చుల మాడ్యూల్లో ఇతర పనుల బిల్లుల డ్రా - వీరవాసరం మండలంలోని పంచాయతీల్లో డీజిల్ ఖర్చులు రూ.25 లక్షలు - 669 పంచాయతీల్లో వెలుగుచూసిన కార్యదర్శుల చేతివాటం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 10:37 AM IST
|Updated : June 26, 2026 at 1:11 PM IST
Officials Have Initiated An Inquiry Into The Misappropriation Of Funds In Grama Panchayats : గ్రామ పంచాయతీల్లో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయి. 669 పంచాయతీల్లో సుమారు 20 కోట్ల రూపాయల నిధులు నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పెట్రోల్, డీజిల్ ఖర్చుల పేరిట ఇతర పనుల బిల్లులను అప్లోడ్ చేసి నిధులు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు సర్పంచులు, కార్యదర్శుల పాత్రపై అధికారులు దృష్టి సారించారు.
సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు : గ్రామ పంచాయతీల నిధులను ఇంటి దొంగలు మేసేశారు. పదవీకాలం ముగిసే ముందు కొందరు సర్పంచ్లు, కార్యదర్శులతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించారు. పంచాయతీల్లో ఖర్చుల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన స్వర్ణ పంచాయతీ పోర్టల్లోని కంటింజెంట్ మాడ్యూల్ను కొందరు కార్యదర్శులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఖర్చుల కింద ఇతర పనులకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేసి, సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు పొందినట్లు వెల్లడైంది.
వెంకటగిరిలో 32 లక్షల రూపాయలు డ్రా : పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని పంచాయతీల్లో డీజిల్ ఖర్చుల పేరిట సుమారు 25 లక్షల రూపాయలు చూపారు. విజయవాడ గ్రామీణ మండలం ప్రసాదంపాడులో దాదాపు 17 లక్షల రూపాయలు, అలాగే తిరుపతి జిల్లా వెంకటగిరిలో 32 లక్షల రూపాయలు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కాలువల మరమ్మతులు, తాగునీటి పైపులైన్ల రిపేర్లు, మోటార్ల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లుతో పాటు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు జరిగినట్లు చూపించి బిల్లులు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ పనులు నిజంగా జరిగాయా? లేక తప్పుడు బిల్లులు సృష్టించారా? అన్న కోణంలో అధికారులు లోతుగా విచారణ చేపట్టనున్నారు.
వివిధ రకాల బిల్లులు అప్లోడ్ : పంచాయతీల్లో నిధుల ఖర్చుల కోసం ప్రభుత్వం పనులు, మెటీరియల్ సేకరణ, కంటింజెంట్ వంటి ప్రత్యేక మాడ్యూళ్లను అమలు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ కొందరు అధికారులు వాటిని పక్కనబెట్టి కంటింజెంట్ మాడ్యూల్లోనే వివిధ రకాల బిల్లులను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త మాడ్యూళ్లను కచ్చితంగా అమలు చేయడం ద్వారా అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిధుల గోల్మాల్ వ్యవహారంలో బాధ్యులెవరు? నిధులు నిజంగానే దుర్వినియోగమయ్యాయా? అనే విషయాలు విచారణ పూర్తైన తర్వాత స్పష్టత రానుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆదాయ వనరులు తక్కువగా ఉన్న చిన్న పంచాయతీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో జాప్యం కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో పాటు రోజువారీ నిర్వహణ కూడా కష్టసాధ్యంగా మారుతోంది. రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీల్లో 70 శాతానికి పైగా పంచాయతీలకు సొంత ఆదాయం చాలా తక్కువగా ఉంది. వీటిలో ఎక్కువ పంచాయతీలకు ఆస్తి పన్ను ద్వారా ఏడాదికి రూ.3 లక్షలలోపే ఆదాయం వస్తోంది.
నిధుల కొరత - సమస్యల తిష్ఠ - అస్తవ్యస్తంగా పంచాయతీల పాలన
గ్రామాలకు మళ్లీ మంచిరోజులు - ఐదేళ్ల తర్వాత పండగ వాతావరణం - good days for ap grama panchayats

