గుంటూరు జిల్లాలో విషాదం - బెలూన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి
నాలుగేళ్ల చిన్నారి ఊపిరి తీసిన గాలి బుడగ - ప్రమాదవశాత్తు గొంతులో బెలూన్ ఇరుక్కొని మృతి - వైద్యులు కృత్రిమ శ్వాసను అందించే ప్రయత్నం చేసినా దక్కని ఫలితం - గుండెలవిసేలా విలపిస్తున్న తల్లిదండ్రులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 7:20 PM IST
|Updated : March 4, 2026 at 7:47 PM IST
Four Years Baby Dies After Swallowing Balloon in Guntur District: ఆడుకునే గాలి బెలూన్ నాలుగేళ్ల చిన్నారి ఊపిరి తీసింది. ఓ పాప బెలూన్తో ఆడుకుంటూ ఉండగా పొరపాటున గొంతులోకి వెళ్లడంతో ఊపిరి రాడక అపస్మారక స్థితిలో వెళ్లింది. ఇది గమనించిన పాప తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు.
దురదృష్టవశాత్తు పాప గొంతులో బెలూన్ ఇరుక్కుపోయిందని చెప్పడంతో అత్యవసర విభాగంలోని వైద్యులు ఆ చిన్నారి గొంతులో నుంచి బెలూన్ అతికష్టం మీద బయటకు తీశారు. అప్పటికే ఊపిరి ఆగిపోయిన పాపకు కృత్రిమ శ్వాస అందించి బతికించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణం నిలబడలేదు.
అసలేం జరిగిందంటే?: గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మంజుల శ్రీను, వెంకటరమణ దంపతులకు నలుగురు ఆడపిల్లలు సంతానంగా కలిగి ఉన్నారు. అయితే ఇందులోని ఇద్దరు పాఠశాలకు వెళ్తుండగా మూడో పాప అంగన్వాడీ కేంద్రానికి వెళ్తూ తన వెంటపడిన చెల్లి శిరీషను కూడా అక్కడకు తీసుకెళ్లింది. వీరి తల్లి వెంకటరమణ ఇద్దరు పిల్లలకు 10 రూపాయలు ఇచ్చి ఏమైనా కొనుక్కోమని చెప్పి బట్టలు ఉతకడానికి వెళ్లింది.
అనంతరం ఆ పిల్లలు ఆ డబ్బుతో బెలూన్ కొనుకొని ఆడుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే నాలుగో పాప శిరీష నోట్లోకి బెలూన్ వెళ్లి గొంతులో ఇరుక్కుపోయింది. మొత్తానికి గొంతులో బెలూన్ అడ్డం పడటంతో శ్వాస అందక తీవ్ర రోదనను అనుభవించింది. ఊపిరాడక శిరీష అపస్మారక స్థితిలో వెళ్లింది. దాంతో హుటాహుటిన చిన్నారి తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్కు తరలించారు.
ఆ తర్వాత వైద్యులు బెలూన్ను గొంతు నుంచి అతి కష్టం మీద బయటకు తీశారు. ఆపై కృత్రిమ శ్వాసను అందించేందుకు పలుమార్లు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారు చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో తల్లిదండ్రులకు చివరకు కడుపుకోత మిగిలింది. ఇంట్లో అందరి మోములో చిరునవ్వులు పూయించే నాలుగేళ్ల చిన్నారి ప్రాణం పోయి నిర్జీవంగా మారడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. వైద్యులు ఎంతో శ్రమించి వైద్యాన్ని అందించినా సరే మా బిడ్డ ప్రాణాలు దక్కలేదని గుండెలవిసేలా బాధపడుతున్నారు.
"మా నాలుగో కుమార్తె శిరీషకు నాలుగు సంవత్సరాలు వయసు. ఈరోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తానంటూ మారాం చేసింది. దాంతో మా మూడో కుమార్తెతో కలిసి పంపించాను. వెళ్లే దారిలో గాలి బుడగను కొనుక్కుని అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బెలూన్తో ఆడుకుంటుండగా అది గొంతులో ఇరుక్కుంది. దాంతో మేం వెంటనే గుంటూరు జీజీహెచ్కు తరలించాం. అనంతరం చిన్నారిని పరిశీలించిన వైద్యులు కృత్రిమ శ్వాసను అందించే ప్రయత్నం చేశారు. కానీ మా పాప అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. చివరకు మా దురదృష్టవశాత్తు మృతి చెందింది. మా చిన్నారి శిరీష మృతి మా కుటుంబాన్ని కలచివేస్తుంది". -వెంకటరమణ, శిరీష తల్లి

